జూన్ నాటికి మరో రెండు లక్షల గృహాలు
ఏప్రిల్ నుంచి రెండో విడత మంజూరు
త్వరలో అర్బన్ హౌజింగ్ పాలసీ
మధ్యతరగతికీ తక్కువ ధరకు ఇండ్లు
ప్రత్యేక పథకం కోసం కసరత్తు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చే ఏడాది మార్చి లోపు రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇండ్లకు సంబం ధించిన గృహ ప్రవేశాలు జరుగుతాయని రాష్ట్ర హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. జూన్ నాటికి మరో
రెండు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందనీ, మొత్తంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇండ్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడత మంజూరు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇందిరమ్మ ఇండ్లే అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని తెలిపారు. ఆ మేరకు రాష్ట్రంలో మొదటి దశలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతున్నదని చెప్పారు. ఈ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి లబ్దిదారులకు నాలుగు దశల్లో ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 23 వేల ఇండ్లు పూర్తయినట్టు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ, పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం అర్బన్ హౌజింగ్ ప్లాన్ను తీసుకురానున్నట్టు తెలిపారు. ముంబయి, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో శాస్త్రీయంగా చేసిన సర్వేలను తెప్పించుకుని అధ్యయనం చేసినట్టు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన డబుల్ బెడ్ రూం ఇండ్లలో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నట్టు తెలిపారు. పేదల జీవనోపాధి ఉన్న చోట కాకుండా ఇతర ప్రాంతాల్లో కేటాయింపులు చేయడంతో లబ్దిదారులు చాలా వరకు పొజిషన్లో ఉండటం లేదని చెప్పారు. అలాంటి చోట్ల పొజిషన్లో లేని ఇండ్లను గుర్తించి స్థానికంగా ఉన్న పేదలకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిపారు. పట్టణ పేదల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీని తీసుకురాబోతున్నట్టు మంత్రి వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ ఆనుకుని నగరానికి నాలుగు వైపులా ‘నో ప్రాఫిట్-నో లాస్’ ప్రాతిపదికన ఇండిపెండెంట్, బహుళ అంతస్థుల భవనాలను నిర్మించనున్నట్టు తెలిపారు. ఒక్కో ప్రాంతంలో 8 వేల నుంచి 10 వేల వరకు ఇండ్లు ఉండే అవకాశముందని చెప్పారు.
బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసిన హౌజింగ్ బోర్డును పునరుద్ధరించేందుకు అప్పటికే వివిధ శాఖల్లో డిప్యూటేషన్పై పని చేస్తున్న 394 మంది ఉద్యోగులను వెనక్కి రప్పించామనీ, 800 మంది ఏఈలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించుకునీ, వివిధ శాఖల నుంచి 150 మందిని డిప్యూటేషన్పై తెప్పించుకకున్నట్టు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలు పెట్టి ఆగిపోయిన ఇందిరమ్మ ఇండ్లు, బీఆర్ఎస్ సర్కార్ గృహ జ్యోతి పేరుతో ఎన్నికలకు ముందు పేపర్లు ఇవ్వడంతో మొదలెట్టిన ఇండ్లకు సంబంధించిన పేదలను కూడా ఆదుకోవాలని క్యాబినెట్లో నిర్ణయించినట్టు ఆయన వివరించారు. అర్హులైన పేదలందరికీ రాబోయే మూడేండ్లపాటు ఇండ్ల పంపిణీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్లో రాబోయే మూడేండ్లపాటు హౌజింగ్ శాఖ చేపట్టబోయే ప్రణాళికను వివరించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూములను గుర్తించి దాదాపు 1,000 ఎకరాల భూముల చుట్టూ హౌజింగ్ బోర్డు కాంపౌండ్ వాల్ నిర్మించిందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో హౌజింగ్ పథకంలో భాగంగా నిర్మాణాలు చేపట్టి శిధిలావస్థకు చేరిన వాటిని కూడా పునరుద్ధరించే యోచన చేస్తున్నట్టు మంత్రి వివరించారు.
మార్చిలోగా లక్ష ఇందిరమ్మ ఇండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



