మాజీమంత్రి హరీశ్రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రయివేటు ఆస్పత్రులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయకుండా ఆరోగ్య భద్రత ద్వారా పోలీసులకు అందించే వైద్య చికిత్సలను నిమ్స్ ఆస్పత్రికే పరిమితం చేయడం అత్యంత దుర్మార్గమని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. పోలీసుల జీతాల నుంచి ప్రతినెలా ఆరోగ్య భద్రత కోసం డబ్బులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి సేవలు అందించడంలో మాత్రం తీవ్ర వివక్ష చూపిస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్యం ప్రజల భద్రత కోసం కృషి చేసే పోలీసులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యాన్ని దూరం చేసి, నిమ్స్ ఆసుపత్రికే పరిమితం చేయడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల, సకాలంలో వైద్యం అందక పోలీసు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని తెలిపారు. గతేడాది అక్టోబర్లో గుండెపోటుకు గురైన ఏఆర్ ఎస్సై జనార్దన్రావును ‘గోల్డెన్ అవర్’లో ఓ ప్రముఖ ప్రయివేటు దవాఖానకు తరలించినప్పటికీ పోలీసు ఆరోగ్య భద్రత కార్డు ద్వారా చికిత్సకు నిరాకరించడంతో సకాలంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా, ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నా పాలకులకు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని తెలిపారు. రేవంత్రెడ్డి పాలనలో పోలీసు ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే రక్షణ కరువైన దిక్కుమాలిన పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆరోపించారు. రక్షణ కోసం వేల మంది పోలీసులను వాడుకుంటూ వారి కనీస హక్కులను కాలరాయడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని తెలిపారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?అని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్లో ఉన్న ఆరోగ్య భద్రత బకాయిలన్నీ చెల్లించి, నిమ్స్తోపాటు అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్, టీఏలు వెంటనే చెల్లించాలనీ, స్టేషన్ అలవెన్సులు నెల నెలా విడుదల చేయాలని కోరారు.
పోలీసులకు వైద్యం నిమ్స్కే పరిమితం చేయడం దుర్మార్గం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



