నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి యాజమాన్యం తొలిసారిగా మహిళలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి అవకాశం కల్పించనుంది. వారికి అవకాశం కల్పించాలన్న సీఎండీ ఎన్.బలరామ్ ఆలోచన మేరకు సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్గా, బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న ఇటీవలనే దరఖాస్తులకు ప్రకటన చేశారు. దీంతో మొత్తం 43 మంది మహిళా కార్మికులు దరఖాస్తు చేశారు. వీరిలో ఇంటర్వ్యూలకు 35 మంది హాజరయ్యారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఎంపిక కమిటీ సభ్యులు జీఎం (సీపీపీ) ఏ.మనోహర్, జీఎం (పర్సనల్) ఐఆర్, పిఎం కవితా నాయుడు, జీఎం (ఓసీపీ) పి.ఎలిషా, సీఎంఓ ఆర్. కిరణ్ రాజ్ కుమార్, జీఎం (హెచ్ఆర్డి) ఆర్. విజయ ప్రసాద్, జీ ఎం (ఎంఎస్) బొజ్జా రవి మహిళా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరక్టర్ ఆదేశాల మేరకు మహిళలు ఏ రంగంలోనైనా పురుషులతో సమానంగా పనిచేయగలరనే ఉద్దేశంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పనిచేడానికి ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను స్వీకరించారని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన మహిళా అభ్యర్ధులకు మెడికల్ టెస్టుల అనంతరం సిరిసిల్లలో గల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ సంస్థ హెవీ గూడ్స్ వెహికల్/ హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 30 రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ఖాళీల లభ్యతను బట్టి ఈపీ ఆపరేటర్ ట్రైనీ కేటగిరి-5 డిసిగేషన్ తో పోస్టింగ్ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, వ్యక్తిగత అభివృద్ధితో పాటు కంపెనీ అభివృద్ధికి కూడా పాటుపడాలని సీపీఆర్ఓ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఓపెన్ కాస్ట్ గనుల్లో మహిళా ఆపరేటర్లకు అవకాశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



