నవతెలంగాణ-హైదరాబాద్: ఇండిగో విమానాల రద్దుతో.. మిగతా ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలు రూట్లలో దాదాపు 10 రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. అయితే మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఈ దోపిడీ ప్రభుత్వం దృష్టికి చేరింది. అయితే విమాన టికెట్ల ధరల పెంపుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని ఎయిర్లైన్స్లకు శనివారం హెచ్చరికలు జారీ చేసింది. నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
మరోవైపు.. ఇండిగో సంక్షోభంగా ఐదో రోజుకి అడుగపెట్టింది. దేశంలోని పలు ప్రధాన నగరాల ఎయిర్పోర్టుల వద్ద ప్రయాణికుల నిరీక్షణ కొనసాగుతోంది. ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో ఎయిర్లైన్స్ ఘోరంగా విఫలం అయ్యిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. విమానాల రద్దు గురించి తెలీక.. సరైన సమాచారం లేక.. ఎయిర్పోర్టులలో హెల్ప్డెస్క్ల వద్ద ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇండిగో సిబ్బంది తమతో మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. ‘‘క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోతుందా?’’ అంటూ ఎయిర్లైన్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



