నవతెలంగాణ-హైదరాబాద్: ఆఫ్ఘనిస్తాన్లోని స్పిన్ బోల్డాక్ జిల్లా కాందహార్ సమీపంలో ఆఫ్ఘన్, పాకిస్తాన్ దళాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు అని ఆఫ్గనిస్తాన్ అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం జరిపిన కాల్పుల్లో ఆఫ్గన్ మజల్ గాలి, లుక్మాన్ గ్రామ ప్రాంతాల్లో ప్రాణ నష్టం సంభవించింది. గాయపడిన వారిలో ఓ మహిళ, పురుషుడు కూడా ఉన్నారు. వీరిని చికిత్స కోసం ఐనో మినా ఆసుపత్రికి తరలించారు. ఇటీవల సౌదీ అరేబియాలో శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఆఫ్గనిస్తాన్లోని కాందహార్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్డాక్ జిల్లా గవర్నర్ శనివారం ఈ మరణాలను ధృవీకరించారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో.. పాకిస్తాన్ భారీ ఫిరంగులతో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు అయిన స్పిన్ బోల్డాన్ జిల్లాలోని నివాసితులపై దాడి జరిపింది. వెంటనే ఆప్ఘన్ దళాలు స్పందించాయి అని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల సైనిక బలగాలు కాల్పుల్ని నిలిపివేశాయి అని కాందహార్ సమాచార విభాగం అధిపతి అలీ మొహమ్ద్ హక్మల్ మీడియాకు చెప్పారు. అలాగే ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్లోని బదానీ ప్రాంతంలో భారీ ఫిరంగులతో దాడికి పాల్పడ్డాయని పాకిస్తాన్ అధికారులు పేర్కొన్నారు.



