- బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ(ఎం) నివాళ్లు
నవతెలంగాణ-హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆయనను స్మరిస్తూ.. శనివారం హైదరాబాదు ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరిచి, మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తుందని మండిపడింది.ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక, లౌకిక, ప్రజాతంత్ర, సామాజిక న్యాయం కోరే శక్తులన్ని ఏకమై పోరాడాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. అలాంటి పోరాటాల్లో సీపీఐ(ఎం) ముందువరుసలో నిలబడుతుందని CPI(M) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హమీ ఇచ్చారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష, దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, సాంఘిక బహిష్కరణలు జరుగుతున్నా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను కఠినంగా అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కులం పేరుతో దాడులు, దౌర్జన్యాలు మరింత పెరిగిపోయాయని, ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించింది. దేశంలో రాజ్యాంగ హక్కులకే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు కోసం అన్ని పార్టీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసినప్పటికీ, కేంద్రం దీన్ని అడ్డుకున్నందని . రిజర్వేషన్ల అమలుపై నిరాశ చెంది ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటనకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అంటూ ఆరోపించింది. అయితే ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడరాదని, అది పూలే, అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధమని సీపీఐ(ఎం) స్పష్టం చేస్తోంది.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, ఎండీ అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్బాబు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.




