బహిరంగ సభకు అగ్రనేతల రాక
జిల్లా కేంద్రం ముస్తాబు
కదలి వస్తున్న కార్మికవర్గం… భారీ ర్యాలీ
హాజరుకానున్న హేమలత, తపన్సేన్, బివి.రాఘవులు
7, 8, 9 తేదీల్లో మహాసభ
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సీఐటీయూ రాష్ట్ర ఐదో మహాసభలకు మెదక్ జిల్లా కేంద్రం ముస్తాబైంది. ఆదివారం మధ్యాహ్నం మెదక్ చిల్డ్రన్స్ పార్క్లో బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న కార్మికులు పట్టణంలోని రాందాస్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆదివారం నుంచి (7, 8, 9 తేదీల్లో) మూడ్రోజులపాటు జరగనున్న మహాసభకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 33 జిల్లాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. బహిరంగ సభ ప్రాంతంతోపాటు మెదక్ పట్టణంలో సీఐటీయూ తోరణాలతో అలంకరించారు. ప్రతినిధుల సభ వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు. అనుబంధ సంఘాల నాయకులు రెండు నెలల నుంచి సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాట్లలో నిమగమయ్యారు.
నేడు చిల్డ్రన్స్ పార్క్లో బహిరంగ సభ
మెదక్లోని చిల్డ్రన్స్ పార్క్లో నేడు జరగనున్న బహిరంగ సభలో సీఐటీయూ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు హేమలత, తపన్సేన్, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, సీఐటీయూ జాతీయ కోశాధికారి సాయిబాబు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ పాల్గొంటారు. అదే విధంగా ప్రతినిధుల సభలో సీఐటీయూ జాతీయ కార్యదర్శి తపన్సేన్ ప్రారంభోప న్యాసం చేయనున్నారు. 33 జిల్లాల నుంచి 600 మంది ప్రతినిధులు పాల్గొనడంతోపాటు సీఐటీయూ పరిశీలకులు, కేంద్ర, రాష్ట్ర నాయకులు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారు. జిల్లా కేంద్రంలోని వినాయక కన్వెన్షన్ సీడబ్ల్యూసీ గోడౌన్లకు ఎదురుగా సిద్దిపేట రోడ్డులోని వినాయక కన్వెన్షన్లో ప్రతినిధుల సభ ఏర్పాట్లు చేశారు.



