ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం
అతిథులు, సంస్థల ప్రతినిధులకు తగిన వసతులు కల్పించాలి : అధికారులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశం సమ్మిట్ ప్రాంగణం పరిశీలన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9వ తేదీల్లో సమ్మిట్ జరగనున్న ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి శనివారం సందర్శించారు. తొలుత హెలికాప్ట్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సభాస్థలికి చేరుకున్న సీఎం ప్రతి హాల్ను పరిశీలించారు. వివిధ సదస్సులు, స్టాళ్ల కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవం…. ఇతర కార్యక్రమాలకు సంబంధించి ప్రదర్శించనున్న డిజిటల్ స్క్రీనింగ్ను వీక్షించారు.
సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సమ్మిట్కు హాజరవుతున్నందున వారికి స్వాగత ఏర్పాట్లు, వసతి, ఇతర సదుపాయాల విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని అధికారులకు సూచించారు. సీటింగ్, ఫైర్ సేఫ్టీ, వాహన రాకపోకలు, ఇంటర్నెట్ ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, కుందూరు జయ్ వీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



