ఉన్నత విద్యామండలి చైర్మెన్కు ఎస్ఎఫ్ఐ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోకి విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించొద్దని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మెన్ వి బాలకిష్టారెడ్డిని శనివారం హైదరాబాద్లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రజినీకాంత్, టి నాగరాజు నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాలను ప్రపంచ వర్సిటీలుగా మార్చేందుకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే నుంచి వర్సిటీలకు అనుమతులు ఇవ్వడమంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్, విదేశీ బహుళజాతి సంస్థల కబంధ హస్తాలు అప్పజెప్పడమేనని తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్ పేరుతో విద్యారంగం అభివృద్ధి కోసమంటూ విదేశీ వర్సిటీలను తేవడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక్కడ వనరులు, మానవ వనరులు విదేశీ వర్సిటీలకు తాకట్టు పెట్టొద్దని కోరారు. ఉన్నత విద్యామండలి చైర్మైన్ బాలకిష్టారెడ్డి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి కిరణ్, కె అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



