రైతులను ముంచిన ఆర్గనైజర్లు
ఇప్పుడు ఎన్నికలపై దృష్టి
వేలంలో సర్పంచ్ పదవుల ఏకగ్రీవాలు
నవతెలంగాణ- మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నడిగడ్డ ప్రాంతంలో సీడ్ పత్తి రైతులను ముప్పు తిప్పలు పెట్టిన ఆర్గనైజర్లు ఇప్పుడు గ్రామపంచాయతీల్లో పదవులపై దృష్టి పెట్టారు. సీడ్ రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలకు ధర పెంచాలని, దిగుబడి అంతా కొనుగోలు చేయాలని, ఆర్గనైజర్ల అరాచకాలను ఆపాలని కోరుతూ రైతు సంఘాలు ఆందోళన చేశాయి. దాంతో కంపెనీలు గద్వాల జిల్లాలో విత్తన సాగును తగ్గించాయి. కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో సీడ్ పత్తి ఆర్గనైజర్లకు పనులు లేక గ్రామ పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఆర్గనైజర్గా రైతులను పీడించి సంపాదించిన డబ్బుతో ఏకగ్రీవంగా సర్పంచ్లను కైవసం చేసుకుంటున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలొస్తున్నాయి. ఇలాంటి ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గద్వాల జిల్లా ధరూర్, గట్టు, కేటీదొడ్డి మండలాల పరిధిలో 15 మందిని పంచాయతీ సర్పంచులుగా ఏకగ్రీవం గా ఎన్నుకున్నారు. ఇందులో 8 మంది సీడ్ ఆర్గనైజర్లు ఉండటం గమనార్హం. ఒకో సర్పంచ్ స్థానానికి 50 లక్షల నుంచి కోటి రూపాయల దాకా వేలం పాడుకుని పదవిని దక్కించుకున్నారు. గుడికి, శ్మశానానికి, పండుగలు చేయడా నికి ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బులు ఇస్తామని చెబుతు న్నారు. రెండో దశలో జరిగే ఎన్నికలలో 15 సర్పంచ్ స్థానా లు ఏకగ్రీవమయ్యాయి. మూడో దశలో ఐదు గ్రామ పంచాయతీలు అయ్యాయి. వీటన్నిటినీ సీడ్ పత్తి ఆర్గనైజర్లు కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఏటా వెయ్యి కోట్లపైగా వ్యాపారం
సీడ్ ఆర్గనైజర్లు వ్యాపారంలో ఏటా కోట్ల రూపాయలు సంపాదించేవారు. రైతుల ఆందోళనలను పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అప్రజాస్వామికంగా పంచాయతీల్లో ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని పలువురు తెలిపారు. నడిగడ్డ ప్రాంతంలో 25 వేల మంది రైతులను ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతీశారని, ఇప్పుడు గ్రామాలపై పడి దోచుకునేందుకు సర్పంచ్లుగా అవతారం ఎత్తుతున్నారని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరైనా నామినేషన్ వేస్తే దాడులు!
ఆర్గనైజర్ పోటీ చేస్తున్న ప్రాంతంలో ఏకగ్రీవం కాకుండా ఎవరైనా నామినేషన్ వేస్తే దాడులుకు పాల్పడు తున్నారు. గట్టు, కేటీదొడ్డి మండలాలలో ఏకగ్రీవానికి ఒప్పుకోకుండా కొందరు నామినేషన్ వేయడానికి వెళితే పత్రాలు తీసుకొని చించేశారని తెలిసింది. ‘చంపేస్తామంటూ ” బెదిరించినట్టు సమాచారం.
ప్రజలకు ఇష్టం లేని ఏకగ్రీవాలు చేస్తే ఊరుకోం
మేము ఎన్నికల ద్వారా మంచి నాయకుడిని ఎన్నుకోవా లి అనుకున్నాం. కానీ కొంతమంది పెద్దలు, సీడ్ ఆర్గనైజర్లు కలిసి కోట్ల రూపాయలకు పదవిని కొనుగోలు చేశారని తెలు స్తోంది. గ్రామ ప్రజలకు ఇష్టం లేని ఏకగ్రీవాలు చేస్తే ఊరుకోం. ఇంకా సమయం ఉంది కాబట్టి నామినేషన్లు వేస్తాం. -రైతు రాములు-కేటీదొడ్డి – అలంపూర్ నియోజకవర్గం
ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు
ప్రజాస్వామ్యబద్దంగా జరిగే స్థానిక ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారు. కొంతమంది అవినీతి అక్రమాలతో సంపాదించిన డబ్బుతో.. ప్రజలకు సంబంధం లేని వాళ్లను ఎలా ఏకగ్రీవం చేస్తారు..? ఐదువేల జనాభా గలిగిన గ్రామాలకు ఎన్నికల్లో రెండున్నర లక్షలు మాత్రమే ఖర్చు చేయాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని సీడ్ ఆర్గనైజర్లతోపాటు కోట్లు గుమ్మరించి సర్పంచి పదవిని కొనుగోలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అలాంటి ఏకగ్రీవాలను రద్దుచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. -సీపీఐ(ఎం) గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి



