నవతెలంగాణ – హైదరాబాద్: సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. సఫారీ జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 39.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (116*) అజేయ శతకంతో కదం తొక్కగా, కెప్టెన్ రోహిత్ శర్మ (75), విరాట్ కోహ్లీ (65*) అర్ధశతకాలతో రాణించారు. ఈ సిరీస్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో మొత్తం 302 పరుగులు చేసిన విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు లభించింది.
అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. “నిజాయితీగా చెప్పాలంటే ఈ సిరీస్లో నా బ్యాటింగ్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. గడిచిన 2-3 ఏండ్లలో ఎప్పుడూ ఇంత స్వేచ్ఛగా ఆడినట్లు అనిపించలేదు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను మన వైపు తిప్పగలననే ఆత్మవిశ్వాసం నాకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లు మనలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తెస్తాయి. సిరీస్ 1-1తో సమమైనప్పుడు, జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నేను, రోహిత్ అనుకున్నాం. ఇప్పుడు జట్టు విజయంలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది” అని వివరించాడు.



