కార్మికులపై పెరుగుతున్న కార్పొరేట్ల దాడి : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
మెదక్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరముందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. ఆ సంఘం రాష్ట్ర ఐదో మహాసభల సందర్భంగా సోమవారం ప్రతినిధుల సభలో ‘రాష్ట్రంలో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలను బలోపేతం చేదాం’ అనే తీర్మానాన్ని భాస్కర్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఉద్యోగులు, సుమారు కోటి 50 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్లోని వారు, ప్రయివేటు పారిశ్రామిక కార్మికులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు స్కీం వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీ, ట్రాన్స్పోర్ట్, బీడీ, గిగ్ వర్కర్లు, వలస కార్మికులు తదితర అసంఘటితరంగ కార్మికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని తెలిపారు. వీరిలో 90 శాతం మంది కనీస వేతనాలకు నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం లేకపోగా అక్రమ తొలగింపులు పెరిగాయని చెప్పారు. శ్రామిక మహిళల పట్ల లైంగిక వేధింపులు అనేక రెట్లు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యూట్ వంటి చట్టబద్ధ సౌకర్యాలు అమలు కావటం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐక్య పోరాటాలు తప్ప మరో మార్గం లేదనే తీర్మానాన్ని భాస్కర్ ప్రవేశపెట్టారు. దీన్ని రాష్ట్ర కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు బలపర్చగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలి
రెండో పీఆర్సీని ప్రకటించాలి : జె.వెంకటేశ్
73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల జీవోలను పెరిగిన ధరలకు అనుగుణంగా సవరించాలని, అన్ని రకాల కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రెండో పీఆర్సీని ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని కార్యదర్శి బీరం మల్లేశ్ బలపర్చగా, మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఐక్య ఉద్యమాలను బలోపేతం చేద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



