– సుమారు రూ.600 కోట్ల విలువ గల
– ఐదెకరాల ప్రభుత్వ భూమిలో..
– ఎన్నో ఏండ్లుగా షెడ్లు ఏర్పాటు చేసుకుని కబ్జాకు యత్నం
– స్థానికుల ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా అధికారులు
నవతెలంగాణ-మియాపూర్
ప్రభుత్వ భూముల రక్షణకు ఏర్పడ్డ హైడ్రా.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని విలువైన భూమిని కాపాడింది. శేరిలింగంపల్లి మండలం మక్త మహబూబ్పేట గ్రామ పరిధిలోని 44/5 సర్వే నంబర్లో గల ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యక్తులు కొన్నేండ్లుగా షెడ్లను ఏర్పాటు చేసుకుని వాటిని కిరాయికి ఇచ్చారు. ప్రభుత్వ భూమిని తమ సొంత భూమిగా అనుభవిస్తున్నారని కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు సోమవారం కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. కూల్చివేతల అనంతరం కంచెను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. మక్త మహబూబ్పేట చెరువు కట్టకు అనుకుని ఉన్న 44/5 సర్వే నంబర్ గల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు కొన్నేండ్లుగా దర్జాగా ఆక్రమించుకొని అక్రమంగా కట్టడాలు చేపట్టినట్టు తమకొచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ తదితర ప్రభుత్వ విభాగాలతో పూర్తిగా సమాచారం తీసుకున్న అనంతరం ఇక్కడ కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. ఈ స్థలంలో పెద్ద ఎత్తున కంటైనర్లు, ప్రయివేటు ట్రావెల్ బస్సులు ఇతర వాహనాలను పార్కింగ్ చేసి ఈ స్థలం ఎవరికి కనపడకుండా ప్రయివేట్ వ్యక్తులకు సంబంధించిన భూమి లాగా నమ్మించేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. 30 మంది సిబ్బంది కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. అనంతరం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించుకున్న కఠిన చర్యలు ఉంటాయని హైడ్రా అధికారులు తెలిపారు.
మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



