Saturday, December 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుతెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి

తెలంగాణ ద్రోహి రేవంత్‌రెడ్డి

- Advertisement -

– ప్రజల బతుకులు మార్చుతానంటూ తెలంగాణ తల్లిని మార్చిండు
– అస్తిత్వ పరిరక్షణకు మరోపోరాటం చేయాలి: మాజీమంత్రి హరీశ్‌రావు పిలుపు
– తెలంగాణ భవన్‌లో ఘనంగా విజరు దివస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ అంటే పోరాటం, త్యాగమనీ, రేవంత్‌ అంటే వెన్నుపోటు, ద్రోహం అని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో విజరు దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ నవంబర్‌ 29న కేసీఆర్‌ దీక్షా దివస్‌ లేకపోతే డిసెంబర్‌ 9న విజరు దివస్‌ లేదనీ, ఈ రెండూ లేకుంటే జూన్‌ 2న తెలంగాణ అవతరణ లేదని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి సమైక్యవాదుల బాటలో నడుస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చే హక్కు సీఎంకు లేదన్నారు. పోరాటంలో పుట్టిన తెలంగాణ తల్లి విగ్రహాలు గ్రామగ్రామాన ఉన్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డి నకిలీ తల్లిని తయారు చేశారని ఆరోపించారు. ప్రజల తలరాతలు మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్‌ తెలంగాణ తల్లిని మార్చారని అన్నారు. తెలంగాణ చిహ్నాన్ని మారుస్తామంటున్నారని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని విమర్శించారు. భారత్‌పై టారిఫ్‌లు పెంచుతూ విద్యార్థులకు గురిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరును హైదరాబాద్‌ రోడ్డుకు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇది భారతీయులను అవమానించడమేనని అన్నారు. డిసెంబర్‌ 23న కాంగ్రెస్‌ విద్రోహ దినం జరపాలన్నారు. నాడు సోనియాను బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు మాటమార్చి దేవత అంటున్నారని చెప్పారు. కేసీఆర్‌ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడు వస్తారనీ, మళ్లీ సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్‌ పేరు చరిత్రపుటల్లో ఉంటుందన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించుకోవడానికి మరోపోరాటానికి సిద్ధం కావాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. అందుకోసం తెలంగాణ ఉద్యమకారులంతా ఏకం కావాలన్నారు. మాజీమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ మహాత్మాగాంధీ దేశానికి ఎలాగో తెలంగాణకు కేసీఆర్‌ అలా ఉంటారని అన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్‌ వక్రీకరిస్తోందన్నారు. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదనీ, అభివృద్ధి లేదని చెప్పారు. మాజీ ఎంపీ బి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలంగాణ ఉద్యమంలోనే పాల్గొనలేదనీ, అలాంటపుడు కేసీఆర్‌ దీక్ష గురించి ఆయనకెలా తెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామంటూ డిసెంబర్‌ తొమ్మిదిన కేంద్రం ప్రకటన ఇచ్చినా కొన్ని రోజుల్లోనే వెనక్కి తీసుకుందని చెప్పారు. డిసెంబర్‌ 23న విద్రోహ దినంగా పాటించాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ నేత జి దేవీప్రసాద్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, నాయకులు జూలూరి గౌరీశంకర్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, రాకేశ్‌రెడ్డి, విజరుకుమార్‌, మాగంటి సునీత, కిశోర్‌గౌడ్‌, గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -