Thursday, December 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్లోబల్‌ సమ్మిట్‌తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

గ్లోబల్‌ సమ్మిట్‌తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

- Advertisement -

– భవిష్యత్తులో కాంగ్రెస్‌ నుంచి బీసీ ముఖ్యమంత్రి : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌
– నెలాఖరుకు కార్పొరేషన్‌ చైర్మెన్‌, ఇతర పదవుల భర్తీ
– సీఎంకు, నాకు మధ్య గ్యాప్‌లేదు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీగా పెట్టు బడులు వెల్లువెత్తాయని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ తెలిపారు. సమ్మిట్‌ విజయవంతం కావడంతో మాజీ మంత్రి హరీశ్‌రావుకు భయం పట్టుకుందని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియా ప్రతినిధు లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలన లో ఎన్ని పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ రెడ్డి దూరదృష్టితో గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా దేశ, విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. సమ్మిట్‌కు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర పెద్దలందరూ విషెస్‌ తెలిపారన్నారు. ఇప్పటికే దావోస్‌తో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఫోర్త్‌ సిటీ, ఫ్యూచర్‌ సిటీ ఒకటేననీ, అన్ని రంగాలపరంగా హబ్‌ ఫ్యూచర్‌ సిటీ అనీ, తెలంగాణ వైపు దేశం చూస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో గత రెండేండ్లుగా అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా సుపరిపాలన కొనసాగుతుందనీ, మెట్రోతో పాటు మూసీ సుందరీకరణ తదితర పనులు చేపట్టిందని తెలిపారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణలో అన్ని రంగాల్లో విధ్వంసం జరగ్గా, రాష్ట్ర భవిష్యత్‌కు గ్లోబల్‌ సమ్మిట్‌ సరికొత్త దశ అని వెల్లడించారు.

నెలాఖరుకు కార్పొరేషన్‌ చైర్మెన్లు
ఈ నెలాఖరుకు కార్పొరేషన్‌ చైర్మెన్లు, మిగిలిన చైర్మెన్లతో పాటు బోర్డు పదవులను భర్తీ చేయనున్నట్టు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. నూతన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, ప్రచార కమిటీలు వస్తాయన్నారు. నిజామా బాద్‌ ఎమ్మెల్యేగా తన పోటీపై పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని చెప్పారు. గ్రామ సర్పంచ్‌ ఏకగ్రీవ ఎన్నిక సాధారణ విషయం కాదనీ, స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గతంలో 50 ఎకరాలు భూదానం చేశానని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నా యన్నారు. తాను పీసీసీ అధ్యక్షునిగా సంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశారు. వందేమాతరం ఆచరించిందే కాంగ్రెస్‌ పార్టీ అనీ, రాజకీయ లబ్ది కోసం ప్రధాని చవకబారు మాటలు మాట్లాడుతున్నా రని విమర్శించారు. ఈవీఎంలను కాంగ్రెస్‌ హయాంలో ప్రవేశపెట్టినప్పటికీ ట్యాంపరింగ్‌ మాత్రం బీజేపీ హయాం లో జరగుతుందనీ, ఓట్‌ చోరీ వంద శాతం జరుగుతుందని విమర్శించారు. ముఖ్యమంత్రికి, తనకు మధ్య గ్యాప్‌ లేదనీ, భవిష్యత్తులో కాంగ్రెస్‌ నాయకత్వంలో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కల్వకుంట్ల లూటీ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌ నేతల లూటీ బయటికి వచ్చిందనీ, దీనిపై సీఎం రేవంత్‌ రెడ్డి విచారణ జరపాలని కోరారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ చేయని అభివృద్ధిని కాంగ్రెస్‌ రెండేండ్లలో చేసిందని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లి విగ్రహాలు ఎవరు తీయలేరన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టించలేదని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన నిజమైన తల్లి సోనియాగాంధీ అని కొనియాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -