నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజల్లో సరైన అవగాహన కొరవడుతూనే ఉంది. దీని ఫలితంగా ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. బీహార్లోని సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీ మహమ్మారి విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఏకంగా 7,400 మంది ఈ వైరస్ బారిన పడినట్లు అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, బాధితుల్లో 400 మంది చిన్నారులు కూడా ఉండటం.
జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్ఐవీ ఉన్నా, పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వారు వివరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అక్తర్ మాట్లాడుతూ.. “జిల్లాలో ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కొత్త హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం గుర్తించిన బాధితుల్లో 5 వేల మందికి పైగా వైద్య చికిత్స అందిస్తున్నాం” అని తెలిపారు. ఈ గణాంకాలు వ్యాధి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.



