– అనుమానాస్పద పరిస్థితుల్లో యువకుడి మృతి…
నవతెలంగాణ – వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాసారపు అభిలాష్ (29) సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన శుక్రవారం స్థానికులను కలచివేసింది. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.నాలుగు రోజుల క్రితం నుంచే అభిలాష్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అభిలాష్ మృతి చెందిన వివరాలు బయటపడటంతో కుటుంబంలో, గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
అభిలాష్ మరణంపై పోలీసులు పలు కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ఇది ఆత్మహత్యన, లేక హత్యా లేదా ఇంకేదైనా కారణం ఉన్నదా అనే విషయాలను స్పష్టంచేయడానికి దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం. కొంతకాలంగా లావాదేవీల విషయంలో ఒత్తిడులు ఎదుర్కొన్నారా అన్న అంశంపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి నిజా నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి అన్ని కోణాల్లో పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.



