కోట్ల రూపాలయల నిధులు నీళ్ల పాలు
నాసిరకమైన పనులు
మళ్ళీ ముక్కలైన చెక్ డ్యామ్ లు
నవతెలంగాణ – మల్హర్ రావు
వరద పోటెత్తుతుంటే వర్షాల నీటిని ఒడిసిపెట్టె అనకట్టలు ఎక్కడికక్కడ ధ్వంసమై వరదల్లో ముక్కలు ముక్కలై కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాల ప్రభావంతో వాగులు, ఏల్ఎండి గేట్ల ఎత్తివేతతో నీటి ప్రవాహం పెరిగి మానేరుపై కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ లు ధ్వంసం మవుతున్నాయి. మండలంలో నిర్మాణాలు చేపట్టిన మల్లారం-అడవిసోమన్ పల్లి,తాడిచెర్ల-ఖమ్మంపల్లి చెక్ డ్యామ్ లు గత రెండేళ్ల క్రితం ముక్కలు కాగా, మళ్ళీ బుధవారం ముక్కలైయ్యాయి.
కారణం గుత్తేదారులు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో నాణ్యత నవ్వుల పాలై కోట్ల రూపాయల ప్రజాసొమ్ము నీళ్ల పాలవుతోంది. భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో మానేరుపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్లు వరద తాకిడికి ఇప్పటికే రెండు సార్లు ముక్కలయ్యాయి. మల్హర్రావు మండలంలోని మల్లారం మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యామ్ మొదటిసారి రూ.8 కోట్ల పైనే ఖర్చు చేసి నిర్మాణం చేపట్టారు. తేలికపాటి వరదల్లో చెక్ డ్యామ్ తోపాటు ప్రక్కనున్న పొలాలు సైతం కోతకు గురైయ్యాయి.
రెండవ సారి రూ.16.62 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వరదలకు మళ్ళీ చెక్ డ్యామ్ నాలుగు ముక్కలైన పరిస్థితి, అలాగే తాడిచెర్ల ఖమ్మంపల్లి మానేరుపై రూ.14.31 కోట్లతో, సోమన్ పల్లి, పివి నగర్ మానేరుపై నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ రూ.13.40 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టారు. భారీ వర్షాలతో చెక్ డ్యామ్లు ముక్కలుముక్కల య్యాయి.
అధికారుల పర్యవేక్షణ… పనుల్లో క్వాలిటీ లేదు..
చెక్ డ్యామ్లు తరచూ వరదల్లో కొట్టుకపోవడం పరి పాటిగా మారింది.చెక్ డ్యామ్ నిర్మాణ పనులపై సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు పనుల్లో క్వాలిటీ లేకనే తరచూ వరదల్లో కొట్టు కుపోతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మానేరు పై 500 మీటర్ల పొడవుతో నిర్మాణం చేయనున్న చెక్ డ్యామ్ ల పనుల్లో సైడ్ వాల్స్ అడుగు భాగంలో గుత్తేదార్లు బైండింగ్ మట్టి పోయకపోవడంతో, చెక్ డ్యామ్లకు ఇరువైపులా కర కట్టలు కట్టకపోవడంతో పొలాలు కోతకు గురైయ్యాయని రైతులు వాపోతున్నారు.
శాశ్వత పరిష్కారమేది..
ఆయకట్టల నిర్మాణంలో భాగంగా ముందుగా వాగులో గట్టితనం వచ్చేవరకు ఇసుకను పూర్తిగా తోడి బెడ్ నిర్మిం చాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఇసుకపై పునాది వేయ డంతో చెక్ డ్యామ్ కింద నీటిని ఎత్తిపోసేందుకు నిర్మించిన ఆప్రాన్లు రిటైనింగ్ వాక్స్, అబార్ట్ మేంట్ భాగాలు వరద ఉధృతికి దెబ్బతింటున్నాయి.వరద ఉధృతి అంచనా వేసేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోయింది. ఇసుక మేటలు పూర్తిగా తొలగించకుండానే చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడంతో దెబ్బతింటున్నాయని పరి వాహక ప్రాంత రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం వచ్చి క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించి వెళుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని ఆరోపిస్తున్నారు.



