సాంకేతికత, ఆర్థికం, కనెక్టివిటీ, భద్రతాంశాలపై చర్చ
న్యూఢిల్లీ : భారత్- ఇజ్రాయిల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం మరో కీలక అడుగు పడింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెత న్యాహుతో జెరూసలెంలో భేటీ అయ్యారు. సాంకేతికత, ఆర్థిక వ్యవస్థ, కనెక్టివిటీ, భద్రత రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై వీరు విస్తృతంగా చర్చించారు. భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇంకా బలంగా, స్థిరంగా ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని జైశంకర్ వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహకారం, భద్రతా వ్యవస్థలపై ఇరు దేశాల మధ్య సహకారం పెంచుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. భారత ప్రధాని మోడీ తరఫున నెతన్యాహుకు శుభాకాంక్షలు తెలియజేశానని జైశంకర్ చెప్పారు.
”ప్రాంతీయ, గ్లోబల్ పరిణామాలపై ప్రధాని నెతన్యాహు అభిప్రాయాలు విలువైనవిగా అనిపించాయి. భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందనే నమ్మకం ఉంది” అని ఆయన ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశాన్ని నెతన్యాహు కూడా సోషల్ మీడియాలో ధృవీకరించారు. జైశంకర్తో జరిగిన భేటీకి సంబంధించిన ఫొటోలను ఆయన షేర్ చేస్తూ.. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రస్తావించారు. ఇక జైశంకర్ పర్యటన జరుగుతున్న వేళ.. నెతన్యాహు భారత పర్యటనకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల మోడీ-నెతన్యాహు ఫోన్ సంభాషణ అనంతరం.. ‘త్వరలోనే ఇద్దరం కలవబోతున్నాం’ అని నెతన్యాహు వ్యాఖ్యానించటం తెలిసిందే.



