ఇద్దరు పదో తరగతి విద్యార్థుల చేతులు విరిగిన వైనం..
విషయం బయటకు రాకుండా యాజమాన్యం యత్నం
నవతెలంగాణ- వేములవాడ
వేములవాడ పట్టణంలోని హంసిని డీజీ హైస్కూల్లో అమానుష ఘటన జరిగింది. స్కూలుకు రాలేదన్న కారణంతో ప్రిన్సిపాల్ ఇద్దరు పదో తరగతి విద్యార్థులను తీవ్రంగా కొట్టిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఒక విద్యార్థి చేయి విరగ్గా.. మరో విద్యార్థి చేతి వేళ్లు విరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన సాయి, అయాన్ అనే విద్యార్థులు పలు కారణాల వల్ల కొద్ది రోజులు పాఠశాలకు హాజరు కాలేకపోయారు. ఇందులో అయాన్ తల్లికి శస్త్రచికిత్స జరగడంతో సుమారు 15 రోజులపాటు ఆమెను చూసుకునేందుకు స్కూల్కు రాలేకపోయాడు. తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉండటంతో కుటుంబ బాధ్యతలు తనపై పడినట్టు అయాన్ మీడియాకు వివరించాడు.
స్కూల్కు తిరిగి వచ్చిన అనంతరం తన పరిస్థితిని వివరిస్తూ క్లాస్కు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ, మాథ్స్ నోట్స్ పూర్తి చేయలేదన్న కారణంతో అయాన్, మరో విద్యార్థి సాయిపై ప్రిన్సిపాల్ సంతోష్ దాడి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నిలదీయగా, విషయం బయటకు రాకుండా చూడాలని యాజమాన్యం బేరసారాలకు దిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హంసిని డీజీ హై స్కూల్ ప్రారంభం నుంచి ఏటా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. రాజకీయ నాయకుల అండతో పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
క్లాసులకు రాలేదని విద్యార్థులపై ప్రిన్సిపాల్ దాడి!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



