నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) స్వరూపం సమూలంగా మారిపోయింది. నగర పాలనలో కీలకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం తుది ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డుల సంఖ్యను 300కి పెంచుతూ పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి (MA&UD) శాఖ గురువారం తుది గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. నగర శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఈ విస్తరణ అనివార్యమైంది. ఈ నిర్ణయంతో ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించింది.
రాబోయే 2026-27 జాతీయ జనాభా గణనను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పరిపాలనా సరిహద్దులను ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ గడువును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వార్డుల పునర్విభజన ప్రక్రియను వేగంగా పూర్తి చేసింది. ఏకీకృత పాలన, పన్నుల విధానం, మెరుగైన పౌర సేవలు అందించే లక్ష్యంతో “తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్” (TCUR) ఏర్పాటులో భాగంగా ఈ విస్తరణ చేపట్టారు. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం సుమారు 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2,050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా కూడా 1.34 కోట్లకు చేరనుంది. దీంతో జీహెచ్ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించనుంది.



