ఎవరూ ఆందోళన చెందొద్దు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ
నవతెలంగాణ- ఖమ్మం
డెస్క్ జర్నలిస్టులకు గతంలో లాగే అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా చూస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) ఖమ్మం జిల్లా అడ్హక్ కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు సంయుక్తంగా శనివారం మహబూబాబాద్లో మంత్రికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల అక్రిడిటేషన్, ఇతర సమస్యలను డీజేఎఫ్టీ నేతలతో కలిసి టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్, కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు సాగర్ దువ్వా, స్టేట్ కౌన్సిల్ సభ్యులు నాగేందర్రెడ్డి వివరించారు.
డెస్క్ జర్నలిస్టులకు సైతం అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందిస్తూ.. డెస్క్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్టీ) అడహక్ కమిటీ కన్వీనర్ కాంకూరి వెంకటేశ్వరరావు, కో-కన్వీనర్లు కేతిరెడ్డి అచ్చిరెడ్డి, వంశీ, శాబాద్ కరుణాకర్రెడ్డి, నాయకులు వెంకటప్పయ్య, వీరభద్రాచారి, బాలకృష్ణ, అశోక్, కరుణాకర్, టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు యాస లక్ష్మారెడ్డి తదితరులున్నారు.



