Wednesday, December 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రణాళిక బద్దంగా చదివితేనే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలం

ప్రణాళిక బద్దంగా చదివితేనే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలం

- Advertisement -

– జిల్లా మానసిక వైద్యాధికారి డా రమణ 
నవతెలంగాణ –  కామారెడ్డి 

చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్, జిల్లా మానసిక వైద్యాధికారి డా రమణ లు తెలిపారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మానసిక ఆరోగ్యం మత్తు పదార్థాల నిరోధకంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మానసిక వైద్యాధికారి డా. రమణ, ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్  అతిథులుగా పాల్గొని విద్యార్థులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ మాట్లాడుతూ పరీక్షా కాలంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలను తెలిపారు. క్రమశిక్షణగా ఉంటూ ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ఈ వయస్సులో విద్యార్థులకు ఏర్పడే ఆకర్షణ తాలూకు విషయాలను విస్మరించి, ఉన్నత లక్ష్యాల వైపు వెళ్లాలని వివరించారు. విద్యార్థులతో పలు మానసిక సమస్యలకు కారణమయ్యే విషయాలపై, టీనేజీలో వచ్చే అవరోధాలపై చర్చించి, పలు ప్రశ్నలను నివృత్తి చేశారు. అనంతరం ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్ మాట్లాడుతూ  మాదక ద్రవ్యాల నిరోధకం కోసం విద్యార్థులు చేయాల్సిన విషయాలను వివరించారు. తమ ఇళ్లల్లో,  ఇంటి చుట్టుపక్కల మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ విలువైన జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నారని, అటువంటి వారి వివరాలను తమకు తెలియజేయాలన్నారు. విద్యార్థులకు మానసికంగా ఎటువంటి ఒత్తిడిని పెట్టుకోవద్దని తెలిపారు.

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ముఖ్యంగా మొబైల్, ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. తమ కుటుంబసభ్యులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను తెలపాలని వివరించారు. డ్రగ్స్ కు బానిసైన వ్యక్తులను ఇదివరకే పట్టుకొని, తీవ్రంగా మందలించి, కౌన్సిలింగ్ అందించినట్లు విద్యార్థులకు తెలిపారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. మత్తుపదార్థాల నిరోధకం, పొగాకు వాడకంపై జిల్లా సైకియాట్రిక్ సోషల్ వర్కర్ డా.రాహుల్ విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. మానసిక సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను, మత్తు పదార్థాల విషయాలు తెలియజేయాలనుకుంటే 14446 ను సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయులు కమల, ఉపాధ్యాయులు సత్యం, విద్యార్థులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -