సామ్రాజ్యవాదం సాగించిన దుర్మార్గం : వెనిజులాపై దాడులకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఖండన
న్యూఢిల్లీ : వెనిజులాపై అమెరికా బాంబు దాడులు, అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని ‘ఉగ్రవాద చర్య’గా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ అభివర్ణించారు. ఇదంతా అంతర్జాతీయ చట్టాన్ని దారుణంగా ఉల్లంఘించడమేనన్నారు. ”వెనిజులాపై బాంబు దాడులు అమెరికా నేతృత్వంలో సామ్రాజ్యవాదం సాగించిన అంతర్జాతీయ ఉగ్రవాద చర్య. అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను కిడ్నాప్ చేశామని ట్రంప్ స్వయంగా చెబుతున్నారు. అదేగనుక నిజమైతే, అంతర్జాతీయ చట్టాన్ని అత్యంత దారుణంగా ఉల్లంఘించడమే.
శాంతి అధ్యక్షుడినని ట్రంప్ చెప్పుకుంటున్న మాటల్లోని డొల్లతనాన్ని ఇది బయటపెడుతోంది. అత్యంత హేయమైన అమెరికా సైనికోన్మాదపు ముఖాన్ని మొత్తంగా ప్రపంచానికి చూపెట్టింది.” అని బేబీ పేర్కొన్నారు. ఈ తరుణంలో ”వెనిజులా ప్రజలకు సంఘీభావంగా నిలుస్తామని చెప్పారు. ఈ చర్యలను ఖండిస్తూ నిరసనలు నిర్వహించాల్సిందిగా పార్టీ సభ్యులకు, కార్యర్తలకు సీపీఐ(ఎం) పిలుపునిస్తోందని చెప్పారు. వెనిజులాపై అత్యంత దారుణమైన ఈ దురాక్రమణ చర్యలను నిలువరించేలా అంతర్జాతీయ సమాజం ఒత్తిడిని పెంచాలన్నారు. భద్రతా మండలి తక్షణమే సమావేశమై ఈ చర్యలను ఖండించాలన్నారు.



