ఎస్సీ గురుకులాల్లో 99.12 శాతం ఉత్తీర్ణత : స్టేట్ టాపర్స్ను సన్మానించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పదవ తరగతి పరీక్షల్లో ఫలితాలు సాధించారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ సొసైటీ పరిధిలో రాష్ట్ర స్థాయిలో టాపర్స్గా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. శాలువను కప్పి, మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏండ్ల చరిత్రలో తొలిసారిగా అత్యధిక ఫలితాలు సాధించినట్టు తెలిపారు. పరీక్షలకు 17,071 మంది హాజరు కాగా 16,921 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వ్యవస్థలో వచ్చిన మార్పులు, నిరంతర పర్యవేక్షణ, ప్రభుత్వ సంకల్పం, వ్యూహాత్మక సంస్కరణల సమిష్టి ఫలితమే ఈ విజయమని అభివర్ణించారు.
235 విద్యాలయాలు 163 పాఠశాలలు 100 శాతం, 9 జిల్లాల్లో అన్ని గురుకులాలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని మంత్రి తెలిపారు. విద్యార్థి కేంద్రంగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు రావడానికి కారణమయ్యాయని చెప్పారు. ఎస్సీ గురుకులాలకు అన్ని విధాల సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీడీడీ ఆధ్వర్యంలో నడిచే 63 ఎస్సీ హాస్టళ్ల నుంచి 8,060 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 7,666 మంది (95.11 శాతం) ఉత్తీర్ణు లయ్యారని మంత్రి తెలిపారు. 91 శాతం నుంచి 100 శాతం మార్కులు 195 మంది విద్యార్థులకు, 81 శాతం నుంచి 90 శాతం మార్కులు 1,416 విద్యార్థులు సాధించారని తెలిపారు.
అసోసియేషన్లతో సమావేశం
బోధనా, బోధనేతర అసోసియేషన్లతో సొసైటీల వారీగా వేరు వేరుగా సమావేశం కానున్నట్టు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హెడ్డాఫీసులో అవసరమైన సిబ్బంది కంటే అదనంగా డిప్యూటేషన్పై ఉన్న వారందరిని జూన్ 1 నాటికి వారి పూర్వ స్థానాల్లోకి పంపిస్తున్నట్టు తెలిపారు. అకస్మాత్తుగా ఏర్పడే ఖాళీలను అవుట్ సోర్సింగ్ ద్వారా వెంటనే భర్తీ చేసేలా ఆయా జిల్లాల కలెక్టర్లకు అధికారం ఇచ్చినట్టు తెలిపారు. అత్య వసర నిధి కింద కొంత మొత్తాన్ని కలెక్టర్ల వద్ద ఉంచ నున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సబ్య సాచి ఘోష్, గిరిజన శాఖ డైరెక్టర్, ఇంచార్జ్ కమిషనర్ సంతోష్, మంత్రి ఓఎస్ డి వై.జె.విజరు కుమార్, టీజీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ జాయింట్ సెక్రెటరీ బానోతు గీత, అడిషనల్ సెక్రెటరీ (అకడమిక్) సక్కు నాయక్, ఆశ్రమ పాఠశాల డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ ఇన్స్టిట్యూషన్లకు చెంది న జోనల్ ఆఫీసర్లు, ఆర్సీఓలు, వివిధ పాఠశా లలు, కళాశాలలకు చెందిన ప్రిన్సిపాల్స్, పదవ తరగతి స్టేట్ టాపర్స్, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
టాపర్స్కు సన్మానం
మంత్రి సన్మానించిన వారిలో సొసైటీ పరిధిలోని వివిధ గురుకులాల నుంచి తిరుపతి ఇస్లావత్ (590 మార్కులు, ఐఐటీ గౌలిదొడ్డి), హానీ మందాడి (586 మార్కులు, ఇల్లంతకుంట గర్ల్స్), అలేఖ్య ఉట్ల (585 మార్కులు, నందిమేడారం గర్ల్స్), ఎం.శ్రుతి (584 మార్కులు, బోథ్ గర్ల్స్), కొత్తూరు స్వేచ్ఛ దాస్ (584 మార్కులు, గౌలిదొడ్డి గర్ల్స్) తో గౌలిదొడ్డి గర్ల్స్ స్కూల్ నుంచి తులసీ కేతావత్ (583 మార్కులు), జస్విక బోడ (581 మార్కులు), హాసినీ గాదరీ (581 మార్కులు), జి.పూజ (580 మార్కులు) ఉన్నారు. అదే విధంగా సొసైటీ పరిధిలోని వివిధ స్కూళ్ల నుంచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి సన్మానించారు.
పదో తరగతిలో కార్పొరేట్కు దీటుగా ఫలితాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



