నవతెలంగాణ – అమరావతి: ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న ఉద్యమంలో పాల్గొనాలని ఆమె చేసిన ఆహ్వానానికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఏపీ పర్యటనకు వస్తానని, పార్టీ పోరాటంలో భాగస్వామ్యం అవుతానని ఆయన హామీ ఇచ్చినట్టు షర్మిల తెలిపారు.
మంగళవారం ఢిల్లీలోని 10 జనపథ్లో ఉన్న రాహుల్ గాంధీ నివాసంలో ఈ సమావేశం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా షర్మిల రాహుల్ను కోరారు. ఇందుకు రాహుల్ అంగీకరించారని, త్వరలోనే ఏపీకి వస్తానని మాట ఇచ్చారని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



