– ప్రధానోపాధ్యాయురాలు హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం పండుగ వాతావరణంలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు పి. హరిత మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సౌకర్యాలను కల్పిస్తోందని, వాటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అశ్వారావుపేట హైస్కూల్ను తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఉన్నతీకరిస్తున్నట్లు తెలిపారు.దీనివల్ల విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలతో పాటు దూర ప్రాంతాల విద్యార్థులకు రవాణా సదుపాయం, మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం, సాయంత్రం తినుబండారాల వంటి అదనపు సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు.పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు.అలాగే ఆరో తరగతిలో కొత్తగా ప్రవేశం పొందిన విద్యార్థులతో మొక్కలు నాటించి, వాటి సంరక్షణ బాధ్యతను వారికి అప్పగించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.



