మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాబోయే పదవుల పంపకాల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మెన్గా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పదవి స్వీకార మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యేలు మందుల సామ్యేల్, వేముల వీరేశం,లక్ష్మీ కాంత్, యెన్నం శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, నాగరాజు, వినోద్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ ప్రీతం, ఫైనాన్స్ చైర్మెన్ రాజయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు, జేబీ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దళితులు డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి, నాలుగు మంత్రి పదవులు ఇచ్చిందని తెలిపారు. దళితులకు, ఆదివాసీలు, బీసీలకు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు తెలిపారు. 17 శాతం ఉన్న ఎస్సీలకు 5 ముఖ్యమైన స్థానాలు ఇచ్చినట్టు తెలిపారు. రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి అర్థరాత్రి తొలగించిన కేసీఆర్ దని విమర్శించారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎస్సీలకు రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలనీ, బడ్జెట్లో నిధులను 18 శాతం కేటాయించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి కోరారు.
కార్పొరేషన్ పదవుల్లోనూ 18 శాతం చైర్మెన్ పదవులు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్స్ లో దళితులకు అవకాశం ఇవ్వాలని ఆకాంక్షించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. రిజర్వేషన్ల ద్వారా లభించిన హక్కులను సాధించుకునేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వారంలో మూడు రోజులు రాష్ట్ర సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. సమస్యలుంటే తనను సంప్రదించాలని అన్నగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ప్రతి నెల ఒక సారి దళిత ప్రజా ప్రతినిధులు సమావేశం పెట్టుకుంటే లోపాలను సరి చేసుకోవచ్చని సూచించారు.
దళితులు సభ్యత్వం తీసుకోవాలి : కవ్వంపల్లి సత్యనారాయణ
దళితులందరూ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవాలని కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. 59 ఎస్సీ కులాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్న రేవంత్ రెడ్డి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. పదవుల్లో 18 శాతం దళితులకు ఇవ్వాలని మహేశ్ కుమార్ గౌడ్ను కోరారు. బ్యాక్లాగ్ పోస్ట్లు భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో దళితులు ఏ పార్టీ వైపుంటే ఆ పార్టీయే అధికారంలోకి వస్తున్నదని తెలిపారు.



