టీసీఏ కార్యదర్శి గురువా రెడ్డి డిమాండ్
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిధులు రూ.68.73 కోట్లు స్వాహా చేసిన వ్యవహారంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి గురువా రెడ్డి డిమాండ్ చేశారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణం సమయంలో విశాఖ ఇండిస్టీస్తో కుదుర్చుకున్న ఒప్పందం విలువ రూ.4.30 కోట్లు కాగా.. మంత్రి వివేక్ కంపెనీ విశాఖ ఇండిస్టీస్ ఆర్బిట్రేషన్ తీర్పుతో ఏకంగా రూ.68.73 కోట్లు హెచ్సీఏ నుంచి లాగేసుకుంది.
మౌలిక వసతుల కల్పనకు అవసరమైన సొమ్మును తీసుకుని.. విశాఖ సంస్థే స్వయంగా రూ.64 కోట్లను క్రికెట్ అభివృద్దికి ఖర్చు చేస్తుందని వివేక్ వ్యాఖ్యానించటం హాస్యాస్పదమని గురువారెడ్డి ఎద్దేవా చేశారు. ‘హెచ్సీఏ నిధులను మంత్రి కంపెనీ వెనక్కి ఇవ్వాలి. నిధుల బదిలీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలి. విచారణ పారదర్శకంగా జరిగేందుకు మంత్రి పదవికి వివేక్ తక్షణమే రాజీనామా చేయాలి. నిధుల బదిలీలో హెచ్సీఏలో కుట్ర జరిగింది. సమగ్ర విచారణతోనే వాస్తవాలు బయటకు వస్తాయి’ అని గురువారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.



