Sunday, March 15, 2026
E-PAPER
Homeక్రైమ్దారుణం.. కూతురు, కుమారుడిపై కత్తితో దాడి చేసిన తల్లి

దారుణం.. కూతురు, కుమారుడిపై కత్తితో దాడి చేసిన తల్లి

- Advertisement -

కుతూరు అక్కడికక్కడే మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దారుణ ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యల నేపథ్యంలో ఓ వివాహిత తన కూతురిని గొంతు కోసి హత్య చేయగా, కొడుకును కూడా హత్య చేయడానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. భువనగిరి రూరల్ పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం బీబీనగర్ మండలం జైనెపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బేజంకి నరేందర్ రెడ్డి భార్య బేజంకి నీలిమ (40) శనివారం సాయంత్రం జైనెపల్లి నుంచి తుక్కాపురం గ్రామంలోని తన అమ్మవారి ఇంటికి వచ్చింది.

ఆదివారం ఉదయం తెల్లవారుజామున నీలిమ తన కుమార్తె బేజంకి కృతిక రెడ్డి (14), ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక గొంతు కోసి హత్య చేసిందని, అనంతరం తన కుమారుడు అక్షిత్ రెడ్డి (11) ఆరో తరగతి విద్యార్థి గొంతు కోయడానికి కూడా ప్రయత్నించగా బాలుడు తప్పించుకుని భయంతో కేకలు వేశాడు. వెంటనే గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని, బాలుడిని ప్రాణహాని నుంచి కాపాడారు. అయితే ఈలోగా ఇంట్లో నీలిమ ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీంతో స్థానికులు హుటాహుటిన తీవ్రంగా గాయపడిన బాలుడు అక్షిత్ రెడ్డిని, ఉరి వేసుకొవడానికి ప్రయత్నించిన తల్లి నీలిమను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న భువనగిరి రూరల్ ఎస్ఐ మిర్యాల అనిల్ ఘటనాస్థలికి చేరుకుని కేసు పరిస్థితిని పరిశీలించారు. అనంతరం చుట్టుపక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ ఘటనకు ముఖ్య కారణం నీలిమ అప్పుడప్పుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా వ్యవహరిస్తుండేదని గ్రామస్థులు తెలిపారు. అదే క్రమంలో ఇద్దరు బిడ్డల్ని చంపే ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా కూతురు కృతికరెడ్డి అక్కడిక్కడే మరణించగా కుమారుడు అక్షిత్ రెడ్డి, తల్లి నీలిమ హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -