నవతెలంగాణ-హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. సీపీ సుధీర్ బాబు పర్యవేక్షణలో తొమ్మిది మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పామ్ హౌస్లో ఇటీవల మద్యం పార్టీ తీవ్ర కలకలం రేపింది.
శనివారం రాత్రి నిర్వహించిన ఈ వేడుకలో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారం రావడంతో ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. 11 మందిని పరీక్షించగా ఇందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన వారిలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి వారి పైకి కాల్పులు జరిపాడు.
దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో 11 మందిపై కేసు నమోదు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్లు అభియోగాలు నమోదు చేశారు. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మలను జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీనితో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు.



