ఎరువుల ఎగుమతులపై చైనా ఆంక్షలు
భారత్ సహా అనేక దేశాలపై ప్రభావం
ప్రపంచ మార్కెట్పై కొత్త ఒత్తిడి
బీజింగ్ : మధప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో చైనా తమ దేశ రైతులను రక్షించుకోవడానికి ఎరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే యుద్ధ ప్రభావంతో కుదేలైన ప్రపంచ సరఫరా పరిస్థితి మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎరువుల ఎగుమతిదారుల్లో చైనా ఒకటి. తమ దేశంలో ఎరువుల ధరలను పెరగకుండా నియంత్రించేందుకు ఎగుమతులను తగ్గించే నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకున్న చైనా.. ఈ సారి మరింత కఠినమైన ఆంక్షలు అమలు చేస్తోన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా గ్లోబల్ సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హార్ముజ్ సముద్ర మార్గం ద్వారా వచ్చే సరఫరా తగ్గిపోవడంతో.. ఇప్పటికే ఎరువుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిలో చైనా ఎగుమతులను తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లో మరింత కొరత పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
చైనా ఇటీవల నైట్రోజన్-పొటాషియం మిశ్రమాలు, కొన్ని ఫాస్పేట్ ఎరువుల ఎగుమతులను నిషేధించింది. యూరియా వంటి ముఖ్యమైన ఎరువులపై ఇప్పటికే కోటాలు అమలులో ఉన్నాయి. దీంతో గతేడాది చైనా ఎగుమతుల్లో 50 శాతం నుంచి 75 శాతం వరకు ప్రభావితం కావొచ్చని అంచనా. భారత్, బ్రెజిల్, ఇండోనేషియా, థారులాండ్ వంటి దేశాలు చైనా ఎరువులపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా భారత్ తన అవసరాల్లో కొంత భాగాన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్.. చైనాను యూరియా ఎగుమతులకు కోటాలు ఇవ్వాలని కోరింది. అయితే.. చైనా ఈ ఆంక్షలను ఆగస్టు వరకు ఎత్తివేయక పోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ధాన్యం ధరలు పెరగకుండా చూసుకోవడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోందని వారు చెప్తున్నారు.



