వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మిస్తున్న నూతన చిత్రం ‘బరి’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యెర్నేని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, నిర్మాత రాజీవ్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘నిహారిక నిర్మాతగా, నేను హీరోగా చేస్తుండటం ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. వంశీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. వచ్చే సంక్రాంతికి ‘బరి’ సినిమాని బరిలోకి దించబోతున్నాం’ అని అన్నారు.
దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ, వాలీబాల్ ఆట నేపథ్యంలో ఓ ఐడియా వచ్చింది. ఆ ఐడియా కార్యరూపం దాల్చి ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని అన్నారు. ”కమిటీ కుర్రోళ్లు’ కంటే పది రెట్లు ప్రభావం చూపేలా ఇందులోని మ్యూజిక్ ఉంటుంది’ అని సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా మాట్లాడుతూ, ‘నిహారిక చాలా మంచి ప్రొడ్యూసర్. వరుణ్తో సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. వంశీ స్టోరీ అద్భుతంగా ఉంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రమేష్ మన్యం, సినిమాటోగ్రఫీ: ధనుష్ భాస్కర్, మ్యూజిక్: అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటర్: అన్వర్ అలీ, కాస్ట్యూమ్స్: ఐశ్వర్య రాజీవ్, ఆర్ట్: విష్ణు వర్ధన్ పుల్ల, ప్రొడక్షన్ కంట్రోలర్: బెక్కం రవీందర్.
‘మా నాన్న ఫ్యామిలీ మెంబర్లతో సినిమాలు తీశారు. వాళ్ల అన్నయ్య, తమ్ముడితో సినిమాలు తీశారు. అలా ఫ్యామిలీ మెంబర్స్తో చిత్రాలు నిర్మిస్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు ఈ రోజు తెలుస్తుంది. మా అన్న వరుణ్తో మూవీని ఈ రోజు ప్రారంభించడం నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది. మా మూవీ ప్రారంభోత్సవానికి మా బాబాయ్ పవన్ కళ్యాణ్ రావడం ఆనందంగా ఉంది. విలేజ్ డ్రామా, స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వంశీ ఈసారి మరో అద్భుతమైన స్టోరీని చెప్పబోతున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరు పోస్టర్ మీద కనిపిస్తే.. ఈ మూవీ కచ్చితంగా చూడాలి. కచ్చితంగా బాగుంటుంది అని ఆడియెన్స్కి అనిపించేలా చేయడమే నా లక్ష్యం’. –నిర్మాత నిహారిక కొణిదెల



