Friday, June 27, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు5న మంత్రివర్గ సమావేశం

5న మంత్రివర్గ సమావేశం

- Advertisement -

– కీలకాంశాలపై చర్చించనున్న రాష్ట్ర క్యాబినెట్‌
– పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే యువ వికాసం జాబితా
– మంత్రివర్గంలో చర్చించాకే ఉద్యోగుల సమస్యలపై నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈనెల ఐదున నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆయన మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వాన కాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్‌ యువ వికాసం తదితరాంశాలపై మంత్రులు ఈ సందర్భంగా సీఎంకు నివేదిక సమర్పించారు. మే 29, 30 తేదీల్లో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రావిర్భావ వేడుకల ఏర్పాట్లతోపాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ, వాటి ఏర్పాట్లకు సంబంధించి జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై మంత్రులు సీఎంకు వివరించారు. రాజీవ్‌ యువ వికాసం పథకానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని వారు తెలిపారు. అనర్హులకు ఈ పథకం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తరువాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని, మరింత లోతుగా విశ్లేషించి లబ్దిదారులను గుర్తించాలని సీఎం ఈ సందర్భంగా నిర్ణయించారు. అర్హులకే ఈ పథకం దక్కేలా చూడాలని ఆయన నొక్కిచెప్పారు. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీ రిపోర్టును అధికారులు… ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే సమర్పించారు. ఆ నివేదికలోని అంశాలను ఆయన సీఎంకు, మంత్రులకు వివరించారు. దీనిపై కూడా మంత్రివర్గంలో చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని మంత్రులు ఈ సందర్భంగా అభినందించారు.
ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తాం : సీఎం రేవంత్‌
రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రావిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సరికొత్త విధానాలు, భవిష్యత్‌ ప్రణాళికలతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కవులు, కళాకారులు, ఉద్యమకారులు, ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -