Wednesday, June 25, 2025
E-PAPER
Homeఆటలుఫైనల్లో పంజాబ్‌

ఫైనల్లో పంజాబ్‌

- Advertisement -

ఛేదనలో శ్రేయస్‌ అజేయ అర్థ సెంచరీ
5 వికెట్లతో ముంబయి ఇండియన్స్‌పై గెలుపు
ముంబయి203/6, పంజాబ్‌ 207/5

పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌18 ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వాలిఫయర్‌2లో ఐదుసార్లు చాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్‌ కింగ్స్‌ 2014 తర్వాత తొలిసారి టైటిల్‌ పోరుకు చేరుకుంది. 204 పరుగుల ఛేదనలో శ్రేయస్‌ అయ్యర్‌ (87 నాటౌట్‌) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. మంగళవారం జరిగే టైటిల్‌ పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌తో పంజాబ్‌ కింగ్స్‌ తలపడనుంది. పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌లో ఎవరు నెగ్గినా.. ఐపీఎల్‌కు కొత్త చాంపియన్‌ రావటం ఖాయం.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
శ్రేయస్‌ అయ్యర్‌ (87 నాటౌట్‌, 41 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) శివమెత్తాడు. క్వాలిఫయర్‌1లో చెత్త షాట్‌తో నిష్క్రమించిన శ్రేయస్‌ అయ్యర్‌.. క్వాలిఫయర్‌2లో తనేంటో చూపించాడు. 8 సిక్సర్లు, 5 బౌండరీలతో అజేయంగా 87 పరుగులు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌ ధనాధన్‌ అర్థ సెంచరీతో పంజాబ్‌ కింగ్స్‌ను ఐపీఎల్‌18 ఫైనల్‌కు చేర్చాడు. నెహల్‌ వదేరా (48, 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోశ్‌ ఇంగ్లిశ్‌ (38, 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో పంజాబ్‌ కింగ్స్‌ 19 ఓవర్లలోనే 207/5 పరుగులు చేసింది. మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే లాంఛనం ముగించింది. అంతకుముందు, తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ 20 ఓవర్లలో 203/6 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ (44, 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (44, 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నమన్‌ దిర్‌ (37, 18 బంతుల్లో 7 ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (38, 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. మంగళవారం అహ్మదాబాద్‌ వేదికగా జరిగే టైటిల్‌ పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి.
శ్రేయస్‌ ఫటాఫట్‌ :
పంజాబ్‌ కింగ్స్‌ లక్ష్యం 204 పరుగులు. ముంబయి ఇండియన్స్‌ పేస్‌ అస్త్రాలు జశ్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ భీకర ఫామ్‌లో ఉన్నారు. పేస్‌ ద్వయం ఎనిమిది ఓవర్లను కాచుకోవటమే పంజాబ్‌కు కష్టమని అనుకున్నారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (6), ప్రియాన్షు ఆర్య (20, 10 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆశించిన ఆరంభం అందించలేదు. అయినా, పంజాబ్‌ కింగ్స్‌ జోరు ఎక్కడా తగ్గలేదు. జోశ్‌ ఇంగ్లిశ్‌ (38) తోడుగా శ్రేయస్‌ అయ్యర్‌ (87 నాటౌట్‌) జోరందుకున్నాడు. ఇంగ్లిశ్‌ నిష్క్రమించినా.. నెహల్‌ వదేరా (48)తో కలిసి మ్యాచ్‌ను మలుపు తిప్పే భాగస్వామ్యం నమోదు చేశాడు. పవర్‌ప్లేలో 64/2తో నిలిచిన పంజాబ్‌ కింగ్స్‌ను ముందుండి నడిపించిన శ్రేయస్‌.. మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 27 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. నెహల్‌ వదేరా సైతం ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో మెరవటంతో ముంబయి ఇండియన్స్‌ బౌలర్లు తేలిపోయారు. 18.4 ఓవర్లలో 200 పరుగులు చేసిన పంజాబ్‌ కింగ్స్‌ 19 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. మంబయి ప్రధాన పేసర్లు జశ్‌ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ సహా టాప్లేలను అయ్యర్‌ ఉతికారేశాడు. అశ్వని కుమార్‌ (2/55) రెండు వికెట్లు పడగొట్టినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లోనే ఏకంగా నాలుగు సిక్సర్లు సంధించిన శ్రేయస్‌ అయ్యర్‌ ఆ ఓవర్లో 26 పరుగులు పిండుకున్నాడు. ఎటువంటి హైడ్రామాకు అవకాశం లేకుండా మరో ఓవర్‌ ఉండగానే పంజాబ్‌ కింగ్స్‌ను టైటిల్‌ పోరుకు చేర్చాడు.
సమిష్టి మెరుపులతో :
తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ సమిష్టి మెరుపులతో 203 పరుగులు చేసింది. ఎలిమినేటర్‌లో మెరిసిన రోహిత్‌ శర్మ (8) నిరాశపరిచినా.. జానీ బెయిర్‌స్టో (38) ఆకట్టుకున్నాడు. తిలక్‌ వర్మ (44) తోడుగా పవర్‌ప్లేలో ముంబయి ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను దూకుడుగా నడిపించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (44), తిలక్‌ వర్మ (44)లు మంచి ఆరంభాలను అందుకున్నా.. ఆశించిన రీతిలో ముగించలేదు. ఆఖర్లో అద్భుతంగా రాణించిన బౌలర్లు పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లు ముంబయి ఇండియన్స్‌ను 203 పరుగులకే కట్టడి చేయగలిగారు. హార్దిక్‌ పాండ్య (15, 13 బంతుల్లో 1 ఫోర్‌) డెత్‌ ఓవర్లలో దారుణంగా ఆడాడు. నమన్‌ దిర్‌ (37) ఎదురుదాడి చేశాడు. ఏడు బౌండరీలతో దండయాత్ర చేశాడు. పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్లలో అజ్మతుల్లా ఓవర్‌జారు (2/43), జెమీసన్‌ (1/30), విజరుకుమార్‌ (1/30), యుజ్వెంద్ర చాహల్‌ (1/39) రాణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -