Friday, June 6, 2025
E-PAPER
Homeజాతీయం'ఉపాధి'కి రూ.5.23 లక్షల కోట్లు

‘ఉపాధి’కి రూ.5.23 లక్షల కోట్లు

- Advertisement -

గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదన
న్యూఢిల్లీ : రాబోయే ఐదు సంవత్సరాల కాలానికి..అంటే 2029-30 వరకూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలుకు రూ.5.23 లక్షల కోట్లు అందజేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు గత నెల 15వ తేదీన వ్యయ ఆర్థిక కమిటీ (ఈఎఫ్‌సీ)కి ప్రతిపాదన పంపింది. ఆర్థిక శాఖ కింద పనిచేసే ఈఎఫ్‌సీ ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులను మదింపు చేస్తుంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల కోసం (2020-21 నుండి 2024-25 వరకూ) కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి విడుదల చేసిన రూ.4.68 కోట్లతో పోలిస్తే ఇది 12శాతం అదనం. కేంద్రం 2020-21లో అత్యధికంగా రూ.1.09,810 కోట్లు విడుదల చేసింది. ఆ సంవత్సరం ఉపాధి చట్టానికి డిమాండ్‌ బాగా పెరిగింది. 7.55 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఈ చట్టాన్ని ఉపయోగించుకున్నాయి. కోవిడ్‌ మహమ్మారి విరుచుకుపడడంతో పట్టణ ప్రాంతాల్లోని కార్మికులు పెద్ద సంఖ్యలో తమ తమ గ్రామాలకు వలస వెళ్లడంతో వారికి ఈ చట్టం బాగా ఉపయోగపడింది.
2024-25లో ఉపాధి చట్టానికి కేంద్రం అతి తక్కువ మొత్తంలో రూ.85,680 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ చట్టం కింద ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. 2021-22లో 7.25 కోట్లు, 2022-23లో 6.18 కోట్లు, 2023-24లో 5.99 కోట్లు, 2024-25లో 5.89 కోట్ల కుటుంబాలు మాత్రమే ఈ చట్టం కింద లబ్ది పొందాయి. 2022-23 నుంచి 2024-25 వరకూ పశ్చిమ బెంగాల్‌లో చట్టం అమలు కాలేదు.
గ్రామీణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలు కేవలం అంచనాలు మాత్రమేనని, కార్మికుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టి అవి మారే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2006-07లో అత్యంత వెనుకబడిన 200 గ్రామీణ జిల్లాల్లో ప్రారంభమైంది. 2007-08లో దీనిని మరో 130 జిల్లాల్లో అమలు చేశారు. 2008-09 నుండి దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -