ఆర్బీఐకి చేరని రూ.2,000 నోట్లు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు పేరుతో రాత్రికి రాత్రి రూ.500, రూ.1,000 నోట్లను పూర్తిగా రద్దు చేసి సామాన్యుడిని విలవిలలాడేలా చేసిన మోడీ సర్కార్.. రెండేండ్ల క్రితం వెనక్కి తీసుకున్న రూ.2,000 నోట్ల మార్పిడికి మాత్రం ఏండ్ల తరబడి గడువు ఇస్తోంది. బడాబాబులు ఉపయోగించే ఈ అతిపెద్ద నోటు ఇంకా చెలామణిలో ఉందని రిజర్వ్ బ్యాంక్ పదే పదే ప్రకటించడం విశేషం. 2023 మే 19న రూ.2000 నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంది. ఆ ప్రకటన నాటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయి. అయితే 2025 మే 30 నాటికి ఇంకా రూ.6,181 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయని సోమవారం ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పెద్ద నోట్లలో 98.26 శాతం తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. టెక్నికల్గా చెలామణిలోనే ఉన్నప్పటికీ.. సాధారణ ప్రజలు, వ్యాపారులు ఎవరూ ఎక్కడ వాడినట్లు కనబడకపోవడం విశేషం. ఇప్పటికీ దేశంలోని 19 ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడికి స్వీకరిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. రూ.500, రూ.1,000 నోట్లను గడువులోగా మార్చుకోకుండా.. తమ వద్దే ఉంచుకుంటే మోసం కేసులను నమోదు చేస్తామని ప్రకటించిన మోడీ సర్కార్.. రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో మాత్రం ఎలాంటి చర్యలను ప్రకటించకపోవడం గమనార్హం.
జాడేలేని రూ.6,181 కోట్లు
- Advertisement -
- Advertisement -