Friday, June 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅతి త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం: అమెరికా

అతి త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం: అమెరికా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సుంకాల ప్రతిష్టంభన నేపథ్యంలో చర్చలు ఊపందుకున్నాయని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైన ఉమ్మడి ప్రయోజనాలపై ఏకాభిప్రాయం కుదిరిందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) ఎనిమిదో వార్షిక సదస్సులో పాల్గొన్న లుట్నిక్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సమీప భవిష్యత్తులోనే కుదురుతుందని మీరు ఆశించవచ్చు” అని అన్నారు. ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయన్న ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, చైనా మినహా ఇతర దేశాలపై ఈ సుంకాలను జూలై 8 వరకు 90 రోజుల పాటు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమ వస్తువులపై అమెరికా విధించిన 26 శాతం అదనపు సుంకం నుంచి భారత్ పూర్తి మినహాయింపు కోరుతోంది. ఈ నేపథ్యంలో జూలై 8 లోపు మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయని వార్తలు వస్తున్న తరుణంలో లుట్నిక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

నిన్న భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్, అమెరికా పరస్పరం ఒకరి వ్యాపారాలకు మరొకరు ప్రాధాన్యంతో కూడిన మార్కెట్ ప్రవేశం కల్పించాలని కోరుకుంటున్నాయని, ఇరు దేశాల బృందాలు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. కాగా, ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అమెరికా అధికారుల బృందం ఈ వారం భారత్‌లో పర్యటిస్తోంది. గత నెలలో, భారత ప్రధాన సంప్రదింపుల అధికారి, వాణిజ్య విభాగం ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వాషింగ్టన్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించారు. వాణిజ్య చర్చలకు మరింత ఊతమిచ్చేందుకు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా ఇటీవల వాషింగ్టన్‌లో పర్యటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -