నవతెలంగాణ – హైదరాబాద్ : భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఏకంగా 39 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. సౌత్ జోన్తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ రెండు ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం 350 పరుగులు సాధించాడు. దీంతో దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్కు కిషన్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో 344 బంతులు ఎదుర్కొని ఏకంగా 270 పరుగులు చేశాడు. అతడి భారీ డబుల్ సెంచరీ సాయంతో ఈస్ట్ జోన్ 708 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ను 336 పరుగులకే కట్టడి చేసి 372 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.
రెండో ఇన్నింగ్స్లోనూ తన ఫామ్ను కొనసాగించిన ఇషాన్, కేవలం 98 బంతుల్లో 80 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ప్రదర్శనతో దులీప్ ట్రోఫీలో ఒకే మ్యాచ్లో 350 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా ఇషాన్ నిలిచాడు. ఇంతకుముందు 1987 అక్టోబర్లో భిలాయ్లో వెస్ట్ జోన్పై నార్త్ జోన్ తరఫున ఆడిన రామన్ లాంబ 320 పరుగులు చేసిన రికార్డును కిషన్ సునాయాసంగా అధిగమించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ తర్వాత ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. తన కెరీర్లో క్లిష్ట దశ తర్వాత మానసికంగా చాలా తేలికపడ్డానని చెప్పాడు. “అనవసరమైన ఆలోచనలు, అంచనాలను మనసులోంచి తీసేశాను. బ్యాటర్గా పరుగులు చేయడమే మన పని అని గ్రహించాను. ఇతర ఆలోచనలు మన మైండ్సెట్ను దెబ్బతీసి, ఒత్తిడిని పెంచుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఆట సులభం అవుతుందని ఇప్పుడు అర్థమైంది. ప్రస్తుతం నేను దేని గురించీ ఎక్కువగా ఆలోచించడం లేదు. బంతిని చూసి దానికి తగ్గట్టు స్పందించడమే నా పని” అని వివరించాడు.



