నవతెలంగాణ – అశ్వారావుపేట
గణేష్ ఉత్సవాల సందర్భంగా డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వారావుపేట సీఐ నాగరాజు ,ఎస్ఐ యయాతి రాజు లు స్పష్టం చేశారు. ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా డీజే యజమానులు, నిర్వాహకులతో ఆదివారం వారు అవగాహన సదస్సు నిర్వహించారు.
వారిరువురి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను వివరించారు. డీజే లు, భారీ శబ్దాలతో కూడిన శబ్ధ పరికారలు వినియోగానికి అనుమతి లేదని తెలిపారు. పోలీసుల ఆదేశాలను ధిక్కరించి డీజే లు నిర్వహిస్తే నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
భారీ శబ్దాలతో ప్రజలకు, వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించరాదన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉన్న డీజే యజమానులు, నిర్వాహకులను ముందస్తుగా బైండోవర్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఉత్సవ కమిటీలు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. పోలీసుల హెచ్చరికలతో డీజే యజమానులు, ఉత్సవ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు.



