నవతెలంగాణ – హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు బుధవారం ఆందోళనను ఉద్ధృతం చేసి, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పెద్ద ధన్వాడ వద్ద గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 12 గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూలీలను తీసుకురావడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పరిశ్రమ ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ, ఆందోళనకారులు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పీకివేశారు. అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వచ్చిన కూలీలను రాళ్లతో తరిమికొట్టడంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనతో పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
పెద్ద ధన్వాడ వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES