Saturday, June 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజివీరిపై ఎందుకీ వివక్ష?

వీరిపై ఎందుకీ వివక్ష?

- Advertisement -

దేశంలో అత్యున్నత స్థాయి అధికారులు వీరు. దేశంలో ఏ స్థాయిలోనైనా పనిచేయగల స్థాయి వీరికి సొంతం.వీరి సామర్థ్యం అంతా కాదు. ప్రభుత్వాల దశ దిశ మార్చగలిగే శక్తి వీరికి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వాల గొప్పతనాన్ని దశ దిశల వ్యాప్తి చేయగలిగే శక్తి కూడా వీరిదే. విధాన నిర్ణేతలు, రూపకర్తలు కూడా. అఖిలభారత స్థాయి అధికారులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ ,ఐఎఫ్‌ఎస్‌ లాంటి ఉన్నత స్థాయి వారి వద్ద ఉన్నత విలువలు ఏ సమాజమైన ఆశిస్తుంది. కానీ వారిచేతలు, మాటలు ఆ స్థాయికి తగినట్లుగా లేకపోతేనే సమస్య. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి తన సంస్థలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు డార్మెటరీలలో పాఠశాల కళాశాల బిల్డింగుల్లో టాయిలెట్లు తామే శుభ్రం చేసుకోవాలంటూ వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు. ఎస్సీ విద్యార్థులు ఏమి ఉన్నత కుటుంబాల నుండి వచ్చిన వారు కాదని, వారికి ఈ పనులు కొత్తవి కాదంటూ ఇంకొంత ఆజ్యం పోశారు.ఈ వ్యాఖ్యలు సహజంగానే చిచ్చు రేపాయి. చివరకు కేంద్ర స్థాయి అధికారులు కూడా స్పందించి సదరు అధికారి నుండి వివరణ కోరినట్లుగా సమాచారం. విద్యార్థులు లేదా వారి కుటుంబాల సామాజిక ఆర్థిక నేపథ్యం కారణంగానే ప్రభుత్వాలు వారికి రకరకాల సౌకర్యాలు కల్పించి వసతులు ఏర్పాటుచేసి ఉన్నత విద్యావంతులుగా వారిని తీర్చిదిద్ది సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. జరిగిన తప్పిదాన్ని సరిచేసి ఆ సామాజిక నేపథ్యం ఉన్న వర్గాల పిల్లలను అందరిలో కలపాలి. వారికి అవకాశాలు కల్పిస్తే వారు ఎవరికి తీసిపోరని నిరూపించే ఒక నిర్మాణాత్మక కార్యక్రమంలో పాలుపంచుకోవాలి. అలా చేయా ల్సింది పోయి ఆ వర్గాల పిల్లలను చాలా చులకనగా మాట్లాడటం యావత్తు సమాజం ఖండించదగిన విషయం. వారు ఉన్నత వర్గాల పిల్లలు కారని వారికి చిన్ననాటి నుండి ఇలాంటి పనులు అలవాటైన వేనంటూ సమర్థించుకోవడం మరీ దారుణం.
అసలు ఎలాంటి నేపథ్యం ఉన్న విద్యార్థులైన తాము చదువుకునే పాఠశాల లేదా కళాశాలలో లేదా హాస్టల్లో పారిశుద్ధ్య పనులు చేసుకునే సంస్కృతి గతంలో ఎన్నడూ లేదే? అందుకు గతంలో రెగ్యులర్‌ సిబ్బంది నేటి రోజుల్లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన సిబ్బంది పని చేస్తున్నారు. విద్యార్థులకు జీవన నైపుణ్యాలు నేర్పుతున్నామన్న కొత్త భాష్యం అర్థం లేనిది. కేవలం తమ వాదనను సమర్ధించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. ఈపని వారికి ఇంటి వద్ద కొత్తేమీ కాదని అధికారులు చెప్పడం మళ్లీ ఇక్కడ నేర్పడంలో అర్థం ఏముంది? మరి ఏ ఇతర సొసైటీలోనూ ఈ రకమైన ఉత్తర్వులు, ఆదేశాలివ్వలేదు. అంటే కేవలం దళిత విద్యార్థులపైనే ఎందుకింత వివక్ష? అసలు తన సంస్థలోని విద్యార్థినీ విద్యార్థులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ఏనాడు ఉలుకు పలుకు లేని అధికారి ఇప్పుడు మాత్రం విద్యార్థినివిద్యార్థులతో జీవన నైపుణ్యాల పేరుతో టాయిలెట్లు కడిగించడానికి సిద్ధపడటం శోచనీయం. సకాలంలో వారికి ధైర్యం చెప్పిజీవితం విలువ లక్ష్యం చెప్పినట్ల యితే ఎన్నో విలువైన జీవితాలు నేల రాలేవి కావు. సాంఘిక సంక్షేమ శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దనే ఉంది. ఆయన ఈ విషయంపై నోరు మెదపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మంగళం పాడే రహస్య అజెండాకూడా ఉన్నదేమోనన్న అనుమానం ఆయన మౌనం ద్వారా బలపడుతున్నది.
అసలు ఉన్నత స్థాయి అధికారులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఈ మధ్య ఒక అధికారి ముఖ్యమంత్రికి బహిరంగ సభలోనే పాద నమస్కారం చేశాడు. ఇలాంటి చర్యలు వారి స్థాయిని తగ్గిస్తున్నాయి. మరొక ఐఏఎస్‌ అధికారి ముఖ్యమంత్రి కాళ్ల వద్ద కూర్చోవడం దిగజారుడుతనం గాక మరేమిటి? ప్రజల్లో వారి గౌరవాన్ని ఇలాంటి చర్యలు మంట కలుపుతున్నాయి. ఎస్సీ,ఎస్టీలకు ఉన్నతంగా సేవలు అందించి వారి కోసమే తమ జీవితాలు ధారపోసిన ఎస్‌ ఆర్‌ శంకరన్‌, డాక్టర్‌ బి.డి శర్మ,, డాక్టర్‌ విద్యాసాగర్‌ లాంటి అధికారులను చూశాం. వారు ఎప్పుడు ప్రభుత్వాల ప్రాపకానికై పాకులాడ లేదు. ప్రజలే అభివృద్ధే ధ్యేయంగా, వారి అభ్యున్నతే పరమావధిగా పనిచేశారు. అహంకారానికి ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. స్వాభిమానాన్ని కోల్పోలేదు. వారు తమ పదవులకు వన్నె తెచ్చారు. దళిత గిరిజన సంక్షేమ పథకాల్లో వాటి రూపకల్పనలో ఆ వర్గాల అభివృద్ధిలో వారి ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ కొంతకాలంగా మనం చూస్తున్న అధికారుల వైఖరి చాలా భిన్నంగా ఉంది. ప్రజలకు, ప్రభుత్వాలకు దగ్గర కావడానికి నిబద్ధతతో నీతి నిజాయితీతో పనిచేయాలి.కానీ ఇలా స్థాయిని దిగజార్చుకునే మాటలు సరికాదు. ప్రభుత్వాలు కాదు ప్రజలే శాశ్వతమని అధికారులు గుర్తుపెట్టుకోవాలి.
– శ్రీశ్రీ కుమార్‌, 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -