నవతెలంగాణ-హైదరాబాద్: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఢిల్లీలో భగవాన్ మహవీర్ వనస్థలి పార్కులో ఒక మొక్కను నాటారు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్న 700 కి.మీ ఆరావళి పర్వత శ్రేణిలో అడవులకు తిరిగి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిందని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మొక్కలు నాటేందుకు ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి ‘ఏక్ పెడ్ మా కే నామ్’ (ఒక చెట్టుకు నా పేరు) పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ప్రచారాన్ని విస్తరించినట్లు ప్రధాని తెలిపారు.
కాగా, పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘అత్యంత పురాతన పర్వత శ్రేణుల్లో ఆరావళి పర్వత శ్రేణి ఒకటి. ఇది గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలను కవర్ చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పర్వత శ్రేణి అనేక పర్యావరణ సవాళ్లను ముందుకు తెచ్చింది. ఈ సవాళ్లను తగ్గించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని’ మోడీ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ పర్వత శ్రేణిని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం దృష్టిసారించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ శ్రేణితో అనుసంధానమైన ప్రాంతాలను పునరుజ్జీవింపజేయడంపై మేము దృష్టి పెట్టాము. దీనికి స్థానిక పరిపాలనతో కలసి పని చేయబోతున్నాము. ఇలా జరగాలంటే నీరు సమృద్ధిగా ఉండాలి. అందుకు తగినవిధంగా నీటి వ్యవస్థలను కూడా మెరుగుపరచేందుకు కృషి చేస్తున్నాం. అలాగే పర్యావరణ మార్పుల్లో భాగంగా తలెత్తే వాయు తుఫానులను అరికట్టడం, ఈ శ్రేణి థార్ ఎడారి తూర్పువైపు విస్తరణను ఆపడం వంటి చర్యలను చేపట్టినట్లు మోడీ పేర్కొన్నారు.