Sunday, June 8, 2025
E-PAPER
Homeసోపతిశ్రీశ్రీ మెచ్చిన కవి బి.రాములు

శ్రీశ్రీ మెచ్చిన కవి బి.రాములు

- Advertisement -

ఈ శీర్షిక మొదలు పెట్టింది తెలంగాణ బాల సాహిత్య చరిత్ర, వికాస చరిత్రలో విస్మృతులైన కవులు, రచయితలను పరిచయం చేయడం, వారిని చరిత్రలో నమోదు చేయడమన్న సంకల్పంతో. ఈ కోవలో మనం అనేక మందిని గురించి చర్చించుకున్నాం, ఈ శీర్షికలో నమోదు చేసుకున్నాం. అందులో భాగంగా ఈ వారం మనం మాట్లాడుకుంటున్న కవి, రయిత, విస్మృత బాల సాహితీవేత్త బి. రాములు. ఆయన నల్లగొండ జిల్లా లోని నర్సింగ్‌బట్ల గ్రామంలో 5 జనవరి, 1949న పుట్టారు. కవిత్వం, నాటిక, గేయం, గేయరూపకంతో పాటు బాల సాహిత్యాన్ని రాశారు.

‘రాములు అభ్యుదయ భావుకుడైన యువకవి’ అంటూ శ్రీశ్రీ కితాబు పొందిన బి. రాములు ‘మదమెక్కిన ధనస్వామ్యం/ మందలించెడు జనస్వామ్యం/ ఆరెంటికి నడుమ నలిగి/ వెలుగు లీనే నా కవిత్వం’ అంటూ శిరమెత్తి గట్టిగా, ఆవేశంగా పలికిన కవి. ఈయన 10వ తరగతి వరకు సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహంలో ఉండి చదువుకున్నారు. నాగార్జున కళాశాల నుండి డిగ్రీ పూర్తిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేరి తహసిల్‌దారుగా పదవీవిరమణ చేశారు. పైలా పచ్చీసులో కవిగా కవిత్వం రాయడం మొదలుపెట్టిన రాములు 1970లో కాంచనపల్లి వెంకటరామారావు, బోయ జంగయ్య, మేదేడ్డి యాదగిరి రెడ్డి మొదలైన వారితో ‘యువ రచయితల సమితి’లో క్రీయాశీలకంగా ఉండి కవిత్వం రాశారు. తొలి నుండి ధిక్కారస్వరంతో కవిత్వం రాసిన వీరికి శ్రీశ్రీ, కాంచనపల్లి, డా. ఎన్‌. గోపి, కె. శివారెడ్డి అభిమాన కవులు. వివిధ ఉద్యమాల్లో క్రియాశీలకంగా వున్న ఆయన తన స్వగ్రామం నర్సింగ్‌బట్లలో యువజన సంఘం స్థాపించి పోరాటాలు చేశారు. ‘మేత్రి’ రాములు రచించిన ఏకాంకిక. ‘వెలుగు రేఖలు’ వీరి నాటిక. ‘స్వాతంత్య్రం వచ్చాక’ వీరు రాసిన గేయ రూపకం. ‘ఓట్లు పాట్లు’, ‘జంగిడోడు’ ఈయన రాసిన గేయ కవిత్వం. కవిగా రాములు ధిక్కార స్వరాన్ని తొలి నుండి వినిపించారు. అది ఆయన కవిత్వమంతా కనిపిస్తుంది. ‘మొదుగుపూలు’, ‘ఊళ్ళు ఉరుకుతున్నాయి’, ‘జెండా కర్రలు’, ‘శిరసెత్తిన’ వీరి కవితా సంపుటాలు. వివిధ సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. వాటిలో శ్రీశ్రీ-చెరబండ రాజు స్మారక పురస్కారం, ప్రవాసాంధ్ర ఒరిసా వారి సాహిత్య పురస్కారం, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉగాది సత్కారం, సాహితీ మేఖల పురస్కారంతో పాటు ‘శిరసెత్తిన’ కవితా సంపుటికి ‘తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిభా పురస్కారాలు వాటిలో కొన్ని. కావ్యకర్తనే కాదు, కార్యకర్తగా కూడా. 1970, 1974, 1983, 2000 సంవత్సరాలలో జరిగిన జిల్లా రచయితల సభలలో క్రియాశీలక పాత్రను పోషించాడు.
కవిత, గేయం, నాటకం, గేయ రూపం వంటి వివిధ సాహిత్య రూపాలు ప్రక్రియలతో పాటు బాల సాహితీ రంగంలోనూ కవి వీరు రచనలు చేశారు. ‘చిరుగీతం’ ఈయన రాసిన బాలగేయ సంపుటం. దీనిని ఆయన నల్లగొండ యువ రచయితల సమితి నుండి ప్రచురించారు. ‘…పిల్లలకు/ రసగుల్లలకు/ ఎల్లలెరుగని/ పిల్లలకు/ చిరునవ్వులకు/ మల్లెలకు/ చిందులువేసే/ చిన్నారులు’ ఆటపాటలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ పుస్తకాన్ని కూర్చారు రాములు. తన చిరుగీతం ‘చిన్నారుల నాలుకలపై/ నడయాడే పదవిన్యాసం’ అని, ‘మన కోసం మనం/ కదలాలి మహాజనం/ ఊరువాడ పరిశుభ్రం/ మనకది మహౌదయం’ అని చెబుతారు. హేతువును తన కవితల్లో, గేయాల్లో చెబుతారు రాములు. వాటిలో ‘అమ్మా! అమ్మా!/ ఏమిటమ్మా/ నాకో అనుమానం/ చెప్పాలమ్మా/ అదేమిటమ్మా/ …బొమ్మలకెందుకు/ పెళ్లిళ్లమ్మా’ అని ఆ కోవలోనే బాలు ప్రశ్నించాలని చెబుతారు. పల్లె నేపథ్యంగా ఎదిగిన కవి ఆయన. తన బాల గేయాల్లో తన పల్లె పైన ఉన్న ప్రేమను పిల్లల కోసం ‘చిట్టిపొట్టి పిల్లలంత/ చెట్టుకింద చేరినారు’ గేయంలో తాటిముంజల ఆటలు, కోతికొమ్మచ్చి ఆటలు, మోటబావుల ఈతలు వంటి జ్ఞాపకాలను జ్మాపకం చేస్తూ ‘..ఎండాకాలం సెలవుల్లో/ పల్లెకు పయనం బాగుందన్నారు/ పల్లెకుపోయి పరిసరాలను/ పరిశీలిస్తే మేలన్నారు’ అంటారు.
దోమల గురించి, వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి ‘ఈగ ఆగడం’ గేయంలో రాసిన ఆయన, మరో గేయం ‘చీమ పోరాటం’లో చీమల క్రమశిక్షణ గురించి, అలుపెరుగని పట్టుదలకు కారణమైన చీమ గురించి, శ్రమైక సంస్కృతికి ప్రతిబింబమైన చీమ గురించి ఈ గేయంలో చక్కగా రాశాడు. మరో గేయంలో ‘శ్రమదానం’ గురించి, ‘బాల బానిసలు’ గేయంలో బాల కార్మికులు, వారి బాధలను గురించి రాశాడు. మరోచోట ‘మొక్కను బాబు/ నన్ను తొక్కకు బాబు’ అంటూ మొక్క ఆత్మ గీతాన్ని, వేదనను గేయంగా రాస్తే, మరోచోట ‘చెమ్మచెక్క నిమ్మచెక్క/ అమ్మలెక్క నిమ్మచెక్క’ అంటూ మేలుకోరే నిమ్మ గురించి, అక్క గురించి చెబుతాడు. ‘మానవ జాతి మనుగడకు/ మరో మలుపు పొదుపు’ అంటూ పిల్లలకోసం గొప్ప మంత్రాన్ని బాల గేయంగా చెప్పిన రాములు ‘చదువు చదివించు/ నీ చదువునందరకు పంచు/ చదవాలి…/ చదివి అందరు ఎదగాలి’ అని కోరుకుంటారు. కవిగా, రచయితగా, కార్యకర్తగా, బాల సాహితీవేత్తగా తనదైన రచనలు చేసిన బి. రాములు కవిగా ఎంత ప్రసిద్ధుడో, బాల సాహితీవేత్తగా అంతే విస్మృతుడు. ఈ వ్యాసంతో తెలంగాణ బాల సాహిత్య వికాస చరిత్రలో బి. రాములు పేరు నమోదుచేసే అవకాశం నాకు రావడం సంతోషాన్ని కలిగిస్తోంది. జయహో! బాల సాహిత్యం!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -