ప్రధాని మోడీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ : మీడియాకు దూరంగా ఎందుకు పారిపోతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది. విలేకరుల సమావేశం నిర్వహించకపోవడంపై ప్రతిపక్ష పార్టీ సోమవారం ఆయనపై తీవ్ర విమర్శలు చేసింది. ఇంకా ఎందుకు పారిపోతున్నారని అడిగింది. ప్రశ్నలు, సమాధానాలు సిద్ధం చేయడానికి సమయం పడుతుందా? అని ప్రశ్నించింది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి పదవిలో 11 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్క్రిప్ట్ లేని విలేకరుల సమావేశం నిర్వహించాలని తాము సవాల్ చేశామని అన్నారు. ‘ప్రశ్నలు, సమాధానాలు సిద్ధం చేయడానికి, దోషిలా ప్రశ్నించడానికి తగిన వ్యక్తులను కనుగొనడానికి సమయం పడుతుందా? లేదా భారత్ మండపం ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదా?’ అని ప్రశ్నించారు. గత ప్రధానుల మాదిరి విలేకరుల సమావేశాలు నిర్వహించే ధైర్యం మోడీకి లేదని జైరాం రమేశ్ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులంతా స్వేచ్ఛాయుత విలేకరుల సమావేశాలు నిర్వహిస్తారని, అయితే మన నాయకుడు 11 ఏండ్లుగా ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఎదుర్కోలేదని ఆరోపించారు. గతేడాది ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ మీడియా సమావేశాలకు దర్శకత్వం వహించారని, స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని అన్నారు. గతంలోని ప్రధానులంతా విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు, ప్రశ్నలకు ఓపికతో సమాధానం చెప్పేవారు అని అన్నారు.
మీడియాకు దూరంగా ఎందుకు పారిపోతున్నారు?
- Advertisement -
- Advertisement -