– భవిష్యత్లోనూ కొనసాగించేలా చూడాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
– తెలంగాణలో ఏటా 50వేల కొత్త క్యాన్సర్ కేసులు
– త్వరలో జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్, కేర్ సెంటర్ల ఏర్పాటు : వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
– అత్యున్నత శ్రేణి హాస్పిటల్గా ‘బసవతారకం’ : చైర్మెన్ బాలకృష్ణ
– బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25వ రజత్సోవ వేడుకలు
నవతెలంగాణ- బంజారాహిల్స్/సిటీబ్యూరో
ఆరోగ్య భారత్ను అందించడంలో హాస్పిటల్స్ చేస్తున్న కృషి భవిష్యత్లోనూ కొనసాగించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోరారు. క్యాన్సర్ చికిత్సలో 25 వసంతాలు పూర్తి చేసుకునున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రజతోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ హాజరై మాట్లాడారు. జీవించే హక్కును అందించడంలో బసవతారకం హాస్పిటల్ ముందంజలో ఉందన్నారు. తాను లిఫ్టులో వస్తున్నప్పుడు ఆ లిఫ్టును వికలాంగుడు నిర్వహించడం చూశాననీ, ఇలాంటి రీతిలో ప్రభుత్వాస్పత్రుల్లో వికలాంగులకు ఉపాధి కల్పించవచ్చేమో ఆలోచించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహకు సూచించారు. అందరూ బాగుంటే సమాజం కూడా బాగుంటుందనీ, అలా క్యాన్సర్తో బాధపడుతున్న వారికి స్వాంతన చేకూర్చడం ద్వారా బసవతారకం ముందుకు సాగుతోందన్నారు.
జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లు : మంత్రి దామోదర
తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55వేల మంది కొత్తగా క్యాన్సర్ బారినపడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలో నానాటికీ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనీ, ప్రస్తుతమున్న ఎంఎన్జే, బసవతారకం హాస్పిటల్స్ పెరుగుతున్న కేసులకు సేవలందిస్తున్నప్పటికీ సరిపోవడం లేదన్నారు. ఎర్లీ స్టేజీలోనే క్యాన్సర్ను గుర్తిస్తే నయం చేయొచ్చని తెలిపారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అలాగే ప్రతి జిల్లాకో క్యాన్సర్ కేర్ సెంటర్ను కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
ఈ సెంటర్లలో క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్, డే కేర్ కీమోథెరఫీ, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ అందిస్తామన్నారు. ఇంకా అడ్వాన్స్డ్ వైద్య సేవలందించేలా రీజినల్ క్యాన్సర్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. పేద రోగులకు సేవలందిస్తున్న బసవతారకం వంటి హాస్పిటల్స్కు ప్రభుత్వం తరుపున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
అత్యున్నత శ్రేణి హాస్పిటల్గా ‘బసవతారకం’ : చైర్మెన్ బాలకృష్ణ
2000వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ హాస్పిటల్ నేడు భారత దేశంలోనే అత్యున్నత శ్రేణి హాస్పిటల్గా రూపాంతరం చెందిందని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మెన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఎన్నో చాలెంజింగ్ కేసులకు చికిత్స అందించాలన్నదే తమ అమ్మగారి కోరిక అని, దాన్ని పూర్తి చేయడం గర్వకారణమని చెప్పారు. వచ్చే ఏడాది ఇదే రోజు రజతోత్సవ ముగింపు వేడుకలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్టు తెలిపారు. పూర్తిగా లాభాపేక్ష లేకుండా రోగి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే భేదాలు చూపించకుండా క్యాన్సర్తో హాస్పిటల్కు వచ్చిన వారికి చికిత్స అందించే దిశగా సంస్థ పని చేస్తోందని వివరించారు. త్వరలోనే ఆంద్రప్రదేశ్లోనూ వెయ్యి పడకల హాస్పిటల్ నిర్మాణానికి స్వీకారం చుట్టనున్నట్టు తెలిపారు. తమ హాస్పిటల్కు రేవంత్రెడ్డి సర్కార్ పూర్తి సహకారం అందిస్తున్నట్టు చెప్పారు.
”ఆరోగ్య భారత్”లో ఆస్పత్రుల కృషి మరువలేనిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES