– ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు
– ప్రతిగా క్షిపణులతో విరుచుకుపడిన టెహరాన్
– అమెరికా హద్దులు దాటేసిందన్న ఇరాన్
– ఆత్మరక్షణకోసం అన్ని అవకాశాలు ఉపయోగించుకుంటాం
– ‘విచారకర స్పందన’ల కోసం ఎదురు చూడండి: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరిక
అమెరికా యుద్ధోన్మాదం మరోసారి వెల్లడైంది. ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా నేరుగా జోక్యం చేసుకుంది. ఇరాన్పై దాడులకు తెగబడింది. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరుతో ఆ దేశ అణుస్థావరాలను ధ్వంసం చేస్తున్నామంటూ దాదాపు 25 నిమిషాలసేపు మూడు ప్రాంతాలపై అత్యంత శక్తిమంతమైన ఏడు బాంబర్లను గురిపెట్టి విధ్వంసానికి పాల్పడింది. దీనితో ప్రపంచదేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ట్రంప్ దుందుడుకు చర్యల్ని తీవ్రంగా తప్పుపట్టాయి. ఇప్పటి వరకు ఇజ్రాయిల్కు పరోక్షంగా సహకారం అందించిన అమెరికా, ఇప్పుడు ఆ ముసుగును తొలగించేసుకుంది. అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయిల్ నిన్న మొన్నటి వరకు పాలస్తీనాపై బాంబుల వర్షం కురిపించి విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. మధ్యప్రాచ్య దేశాల్లోని చమురు నిక్షేపాలను కైవసం చేసుకోవాలనే అమెరికా దుర్బుద్ధే ఈ యుద్ధాలకు కారణంగా కనిపిస్తుంది. దానికోసమే నిన్న మొన్నటి వరకు ఇజ్రాయిల్ను ఇరాన్పైకి ఉసిగొల్పి, తమతో ఒప్పందం చేసుకొమ్మని ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. దీనికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ అంగీకరించకపోవడంతో ఇప్పుడు నేరుగా ట్రంప్ సైన్యం యుద్ధంరంగంలోకి దిగింది.
టెహరాన్ : అనుకున్నంతా అయింది. అగ్రరాజ్యం మరోసారి తన యుద్ధోన్మాద ధోరణిని బయటపెట్టింది. ఇరాన్పై క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్కు నిన్నటి వరకూ పరోక్ష మద్దతు తెలిపిన అమెరికా ఇప్పుడు నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది. ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై శనివారం రాత్రి దాడి చేసింది. శాంతి స్థాపనకు ముందుకు రాకుంటే మరిన్ని దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. దౌత్యానికి రెండు వారాల గడువు ఇస్తున్నామని రెండు రోజుల క్రితమే చెప్పిన ట్రంప్ ఇప్పుడు హఠాత్తుగా దాడులపై ప్రకటన చేశారు. దీనిపై ఇరాన్ aధీటుగా స్పందించింది. అమెరికా దాడులు ‘శాశ్వత పరిణామాల’కు దారి తీస్తాయని హెచ్చరించింది. తాజా పరిస్థితిపై చర్చించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని అత్యవసరంగా సమావేశపరచాలని కోరింది. అమెరికా దాడికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్పై భారీగా క్షిపణులు
ప్రయోగించింది. ‘విచారకర స్పందన’ల కోసం ఎదురు చూడండని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికాను హెచ్చరించింది.
దాడులు ఇలా…
ఫోర్డో, నటాంజ్, ఎస్ఫహాన్లోని ఇరాన్ అణు స్థావరాలపై అత్యంత విజయవంతంగా దాడి చేశామని ట్రంప్ ఆదివారం సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. దాడుల్లో బీ-2 రహస్య బాంబర్లను ఉపయోగించామని ధ్రువీకరించారు. ఈ బాంబర్లు బంకర్ను ధ్వంసం చేసే జీబీయూ-57ని మోహరించాయి. ఈ బాంబు సంప్రదాయ వార్హెడ్ను మోసుకుపోతుంది. అది పేలడానికి ముందు భూమిలోకి 200 అడుగుల లోతు వరకూ చొచ్చుకు పోతుంది. ఒకే సమయంలో ఇలాంటి అనేక బాంబులను ప్రయోగించవచ్చు. ప్రతి దాడిలోనూ వార్హెడ్ భూగ ర్భాన్ని మరింత తొలుచు కుంటూ వెళుతుంది. జీబీయూ -57ఏ/బీని మోసుకుపోగల సామర్ధ్యం ప్రస్తుతం బీ-2 బాంబర్కే ఉంది. ఫోర్డోపై జరిపిన దాడిలో ఏడు బీ-2 బాంబర్లను ఉపయోగించారు. ఇక ఎస్ఫహాన్ అణు స్థావరంలోని కీలక లక్ష్యాలపై అమెరికా జలాంతర్గామి నుంచి రెండు డజన్లకు పైగా తొమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించారు. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అమెరికా క్షిపణి వ్యవస్థ కన్నుగప్పి ఈ దాడులు చేశామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మెన్ డాన్ కెయిన్ చెప్పారు. మొత్తంమీద దాడుల్లో అమెరికా 14 బంకర్ విధ్వంసక బాంబులను ఉపయోగించింది. కాగా దాడులలో భాగస్వాములైన సైనిక సిబ్బందిని యుద్ధ వీరులుగా పెంటగాన్ అభివర్ణించింది. ఇజ్రాయిల్ అందించిన మద్దతుకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సేథ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ దాడుల కోసం కొన్ని నెలల పాటు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కాగా ఫోర్డోలోని కీలక భూగర్భ అణు స్థావరం అమెరికా దాడికి గురైంది. దాడిలో ఈ స్థావరం యొక్క ప్రవేశ ద్వారాలు దెబ్బ తిన్నాయి. బంకర్ను ధ్వం సం చేసే ప్రత్యేక బాంబు లను అమెరికా ఉపయోగిం చిందనీ, ఫలి తంగా ఆ స్థావరం చుట్టూ శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని అసోసియే టెడ్ ప్రెస్ తీసిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఆకాశంలో దట్టంగా పొగలు కూడా వ్యాపించాయి. కాగా ఫోర్డోపై అమెరికా జరిపిన దాడి ప్రభావాన్ని అంచనా వేస్తున్నామని ఇజ్రాయిల్ చెప్పింది. ఎంత నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపింది.
మండిపడిన టెహరాన్
అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ‘ఇరాన్ శాంతియుత అణు స్థావరాలపై దాడి చేయడం ద్వారా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా ఐరాస ఛార్టర్, అంతర్జాతీయ చట్టం, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్పీటీ) ఉల్లంఘించింది. ఈ ఉదయం జరిగిన పరిణామాలు అత్యంత దారుణమైనవి. ఇవి శాశ్వత పరిణామాలకు దారి తీస్తాయి. అత్యంత ప్రమాదకరమైన, అధర్మమైన, నేరపూరిత అమెరికా ప్రవర్తనపై ఐరాసలోని ప్రతి సభ్య దేశం ఆందోళన వ్యక్తం చేయాల్సి ఉంది. చట్టబద్ధంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు ఐరాస ఛార్టర్, అందులోని నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని, ప్రయోజనాలను, ప్రజలను కాపాడుకునేందుకు అన్ని అవ కాశాలను వినియోగించుకుంటుంది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీ సామాజిక మాధ్యమం ఎక్స్్లో స్పష్టం చేశారు. తాను మాస్కో వెళుతున్నానని, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో తాజా పరిణా మాలపై సంప్రదింపులు జరుపుతానని ఆయన చెప్పారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. హర్మజ్ జలసంధిని మూసేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ఇరాన్ వద్ద అనేక అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దౌత్య ప్రయత్నాలపై మాట్లాడుతూ ‘ముందు మా స్పందన కోసం ఎదురు చూడండి. దూకుడు తగ్గినప్పుడు దౌత్యం గురించి నిర్ణయిస్తాం’ అని అన్నారు. అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇక దౌత్యానికి అవకాశం ఏముంటుందని ప్రశ్నిస్తూ, అయినా దౌత్యానికి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతామని తెలిపారు. అమెరికా అన్ని సరిహద్దులు దాటేసిందని, ఇక ఏమీ మిగలలేదని చెప్పారు. అణు స్థావరాలపై దాడి చేయడం ద్వారా అమెరికా అతి పెద్ద సరిహద్దును దాటిందని తెలిపారు. జరగబోయే పరిణామాలకు పూర్తి బాధ్యత అమెరికాయే తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ ఇరాన్నే కాకుండా అమెరికాను కూడా మోసం చేశారని అబ్బాస్ అరగ్చీ మండిపడ్డారు.
ట్రంప్కు నెతన్యాహు థ్యాంక్స్
ఇజ్రాయిల్ – ఇరాన్ ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకుంది. తాజాగా శనివారం రాత్రి ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడి చేసింది. ఇలా దాడి చేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు అభినందించారు. ‘అధ్యక్షుడు ట్రంప్కి నా అభినందనలు. ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకోవాలనే మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుంది. ఆపరేషన్ రైజింగ్ లయన్లో.. ఇజ్రాయిల్ నిజంగా అద్భుతమైన పనులు చేసింది. కానీ శనివారం రాత్రి ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడితో అమెరికా నిజంగా గొప్ప పని చేసింది. ఏ ఇతర దేశం చేయలేని పని అమెరికా చేసింది’ అని నెతన్యాహు వీడియో పోస్టులో ట్రప్ను పొగడ్తలతో ముంచెత్తారు.ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాలనను, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను తిరస్కరించడానికి వ్యవహరించిన వ్యక్తిగా అమెరికా అధ్యక్షుడు చరిత్ర సృష్టించారని నెతన్యాహు అన్నారు. ‘అధ్యక్షుడు ట్రంప్, నేను తరచుగా చెబుతాము. బలం ద్వారానే శాంతి వస్తుంది. మొదట బలం వస్తుంది. ఆ తర్వాత శాంతి వస్తుంది. శనివారం రాత్రి అమెరికా మొదట తన బలం చూపించింది. అమెరికా చర్యకు ట్రంప్కు నా కృతజ్ఞతలు’ అని నెతన్యాహు వీడియో పోస్టులో తెలిపారు.
ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్
జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మెన్ జనరల్ డాన్ కెయిన్
ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా చేసిన దాడులకు ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ అనే కోడ్నేమ్ పెట్టార. మొత్తం ఆపరేషన్ 25 నిమిషాల్లో పూర్తైంది. దాడుల్లో 14 బంకర్-బస్టర్ బాంబులు, రెండు డజన్లకుపైగా టోమాహాక్ క్షిపణులు , 125కి పైగా సైనిక విమానాలు ఉన్నాయి. ఇటీవలి మధ్యప్రాచ్య వివాదంలో ఇరాన్పై అమెరికా ఈ మందుగుండు సామగ్రిని ఉపయోగించడం
ఇదే మొదటిసారి.
దాడులు…ప్రతి దాడులు
తన సైనిక స్థావరాలపై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయిల్పై వరుసగా క్షిపణులు ప్రయోగించింది. దీనిని రెండు దేశాలు ధృవీకరించాయి. రాజధాని టెల్ అవీవ్ సహా దేశంలోని పలు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించాయని ఇజ్రాయిల్ మీడియా తెలిపింది. ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, క్షిపణులను ప్రయోగించామని ఇజ్రాయిల్ సైన్యం తెలియజేసింది. మరోవైపు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఘర్షణలను నివారించేందుకు యూరోపియన్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పశ్చిమ యూరోపియన్, ఇరాన్ నేతల మధ్య నాలుగు గంటల పాటు ముఖాముఖి చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఫలితం రాలేదు.
కాలుష్యం పెరగలేదు : ఐఏఈఏ
ఇరాన్ అణు స్థావరాలపై జరుగుతున్న సైనిక దాడుల కారణంగా కాలుష్య ప్రమాదం తలెత్తే అవకాశాలు పెద్దగా లేవని నిపుణులు తెలిపారు. అమెరికా దాడుల తర్వాత రేడియేషన్ స్థాయి పెరగలేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) కూడా చెప్పింది. ఇస్ఫహాన్లోని ఆరు భవనాలపై దాడి జరిగిందని, వాటిలో గతంలో దెబ్బతిన్న నాలుగు భవనాలు కూడా ఉన్నాయని ఐఏఈఏ వివరించింది. అయితే ఈ భవనాలలో కొన్నింటిలో అసలు అణు సామగ్రే లేదని, మరి కొన్నింటిలో కొద్దిగా ఉన్నదని తెలిపింది.
ఇరాన్ అధ్యక్షుడికి మోడీ ఫోన్ : ఉద్రిక్తతలను వెంటనే నివారించాలని సూచన
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో మాట్లాడారు. ఉద్రిక్తతలు పెరగడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వాటిని వెంటనే తగ్గించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా శాంతి, భద్రత, సుస్థిరత పునరుద్ధరణకు చర్చలు, దౌత్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలన్న భారత్ ఆకాంక్షను తెలియజేశారు. అమెరికా దాడులు జరిగిన కొద్ది గంటల వ్యవధిలోనే ఇరువురు నేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అనంతరం మోడీ సామాజిక
చెప్పారు.
అమెరికాకు శాశ్వత గాయమే
తమ దేశంలోని అణుస్థావరాలపై అమెరికా దాడులతో ఇక అగ్రరాజ్యానికి శాశ్వత గాయం ఖాయమైంది. ఆ దేశం తన చర్యలతో అంతర్జాతీయ చట్టాలను, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని (ఎన్పీటీ) ఉల్లంఘించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన అమెరికా.. తన నేరపూరిత ప్రవర్తనతో తాము శాంతియుతంగా ఏర్పాటు చేసుకుంటున్న అణుకేంద్రాలపై దాడులకు పాల్పడింది. ఈ చర్యలతో అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది.
– ఇరాన్ విదేశాంగ మంత్రి