నవతెలంగాణ-హైదరాబాద్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రయాణిస్తున్న రోదసీ నౌక ఫాల్కన్ 9 నింగిలోకి దూసుకువెళుతోంది. యాక్సియం -4 మిషన్లో భాగంగా ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లనున్నారు. ఫ్లోరిడాలో నాసా కెన్నెడీ స్పేస్సెంటర్లో భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01గంటలకు ఫాల్కన్ 9 టేకాఫ్ అయ్యింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి క్యాప్సుల్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించింది.

వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడుతూ వస్తోంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా.. శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది.
అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్ను చేపట్టింది. భారత రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా), ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)లు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ- విస్నియెస్కీ (పోలండ్) రోదసిలోకి వెళ్లారు.
