నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకు నిదర్శనం జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సరైన ఆలనాపాలనా లేక ఇవాళ జూరాల ప్రాజెక్టు డేంజర్ లో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిఏటా ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతుందని తెలిసినా..సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గం మొద్దు నిద్రలో ఉందని మండిపడ్డారు. స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించడంలో రేవంత్ సర్కారు నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
ఇప్పటికే ఈ ప్రభుత్వ అసమర్థత వల్ల SLBC టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది చనిపోయారని ఆయన ఆరోపించారు. పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. వట్టెం పంప్ హౌజ్ మునిగిపోయిందని, సుంకిశాల రిటేనింగి వాల్ కుప్పకూలి వందల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లో ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.