ఈసీని కలిసేందుకు తమ నాయకత్వ బృందం సిద్ధం :ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ
వారంలోగా ఓటర్ల జాబితాల డిజిటల్, మెషిన్-రీడబుల్ కాపీలు కావాలి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు నాటి వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు సంబంధించి లేఖను పంపింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి జూన్ 12న ఎన్నికల సంఘం రాసిన లేఖకు ప్రతిస్పందనగా కాంగ్రెస్కు చెందిన ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ (ఈఏజీఎల్ఈ) గ్రూపు ఎన్నికల సంఘానికి ఈ లేఖను ఎన్నికల సంఘం కార్యదర్శి అశ్వనీ కుమార్ మోహల్కు రాసింది. మహారాష్ట్ర, హర్యానా ఓటర్ల జాబితాల డిజిటల్, మెషిన్-రీడబుల్ కాపీలను వారంలోగా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ తన లేఖలో స్పష్టంగా పేర్కొంది. అలాగే, పోలింగ్ రోజు వీడియో రికార్డింగ్ను ఇవ్వాలని కోరింది. తమ డిమాండ్ను పరిష్కరించడం ఎన్నికల సంఘానికి కష్టమైన పనేం కాదని పేర్కొంది. తమ ఈ డిమాండ్ కూడా కొత్తదేం కాదని, ఈ విషయంలో పార్టీ చాలాకాలంగా డిమాండ్ చేస్తుందని పేర్కొంది. రాజకీయ పార్టీల విశ్వాసాన్ని పెంచడమే కాక, ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవాలని కోరింది. ఓటర్ల జాబితాలు, వీడియో ఫుటేజ్లను అందుకున్న వెంటనే తమ పార్టీ అగ్రనాయకత్వ బృందం ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది. మొత్తం ప్రక్రియపై బహిరంగ చర్చ జరిగేలా విశ్లేషించడంతో పాటు ఆధారాలను కమిషన్ ముందుంచనుందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను బహిర్గతం చేసే డేటా, విశ్లేషణ తమ వద్ద ఉందని తెలిపింది.
”భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య, స్వతంత్ర, గణతంత్ర రాజ్యంగా స్థాపించడంలో సహాయపడిన పార్టీగా, ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడానికి ఈసీకి కాంగ్రెస్ అగ్రనాయకత్వం సహకరిస్తుందని పేర్కొంది. అదేవిధంగా, భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో గౌరవించే ప్రజాస్వామ్యంగా ఈసీ నిలబెట్టుకోవడం కోసం, భారతదేశ బిలియన్ ఓటర్లు, దాని రాజకీయ పార్టీల పూర్తి విశ్వాసాన్ని ఈసీ నిలుపుకోవాలి” అని పేర్కొంది. 2024 డిసెంబర్ నుంచి ఇండియా బ్లాక్ పార్టీల నాయకులు లేఖలు, పిటిషన్లు, కథనాలు, పత్రికా సమావేశాలు, పార్లమెంటులో ప్రసంగాల ద్వారా ఈ అంశాలను హైలైట్ చేస్తున్నామని తెలిపింది.
”2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో అకస్మాత్తుగా భారీ పెరుగుదల, ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తరువాత పోలింగ్లో వివరించలేని పెరుగుదల గురించి మేము చాలా వాస్తవమైన అంశాలను ముందుకు తెచ్చాం” అని పేర్కొంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంటరీ ఎన్నికల మధ్య గత ఐదేండ్ల కంటే, 2024 మేలో జరిగిన లోక్సభ ఎన్నికలకు, రాష్ట్రంలో అదే సంవత్సరం నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఎక్కువ మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని పేర్కొంది. ”ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. ఈ కొత్త ఓటర్లు ఎవరు? వారు ఎక్కడ నుండి వచ్చారు?” అని ప్రశ్నించింది. దీనిని క్షుణ్ణంగా పరిశోధించడానికి 2024 మహారాష్ట్ర లోక్సభ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను, రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు తుది ఓటర్ల జాబితాను పోల్చడం ప్రారంభ దశ తెలిపింది. ”ఈ రెండు ఓటర్ల జాబితాలను అందించడం తప్ప, ఎన్నికల కమిషన్ అన్ని రకాల ప్రతిస్పందనలు, మీడియా లీక్లు, అబద్ధాలలో నిమగమై ఉండటం ఆసక్తికరంగా, గందరగోళంగా ఉంది. అభ్యర్థించినట్లుగా మీరు మాకు తుది ఓటర్ల జాబితాలను ఎందుకు ఇవ్వరు? మీరు చాలా కాలంగా దీనిని తప్పించుకున్నారు. కాబట్టి, మేము తదుపరి ప్రశ్నను అడగాల్సి వస్తుంది. అసలు ఈ ఓటర్ల జాబితాలు మీ వద్ద ఉన్నాయా? లేదా మీ వద్ద లేవా?” అని ప్రశ్నించింది. ఈ సందర్భంలో పోలింగ్ రోజు వీడియో ఫుటేజ్ను అందించకపోవడం మరిన్ని సందేహాలను, అనుమానాలను రేకెత్తిస్తుంది” అని పేర్కొంది.
హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల వివరాలివ్వండి
- Advertisement -
- Advertisement -